కరోనా వ్యాప్తి దృష్ట్యా అమలు చేసిన లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించి మే 5న ప్రకటన చేయనున్నట్లు వెల్లడించింది కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్డీ). కేంద్రమంత్రి అదే రోజున విద్యార్థులతో ఆన్లైన్లో సంభాషించనున్నట్లు తెలిపింది. కొంతకాలంగా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశార్హత పరీక్షల కోసం చూస్తున్న విద్యార్థులకు హెచ్ఆర్డీ ప్రకటనతో కాస్త ఊరట లభించింది.
''కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.. పోటీ పరీక్షల నూతన తేదీలను మే 5న ప్రకటిస్తారు. ఈ ప్రకటనతో విద్యార్థుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోనుంది. అదే రోజున కేంద్ర మంత్రి ఆన్లైన్ ద్వారా విద్యార్థులతో సంభాషిస్తారు.''
- కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఈఈ-మెయిన్స్, వైద్య కళాశాలల్లో చేరేందుకు నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.