ETV Bharat / bharat

నేపాల్​కు నరవాణే ప్రయాణం... ఎందుకంటే?

author img

By

Published : Oct 26, 2020, 6:00 AM IST

manoj mukund naravane
నేపాల్​కు నరవణే ప్రయాణం... ఎందుకంటే..?

సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు కీలక ద్వైపాక్షిక అంశాలు చర్చించటానికి నేపాల్​ వెళ్లనున్నారు భారత సైన్యాధిపతి జనరల్​ ఎం.ఎం నరవాణే. నవంబర్​ తొలివారంలో మూడు రోజుల పాటు హిమాలయ దేశంలో పర్యటించనున్నారు.

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే.. నవంబర్​ 4 నుంచి 6 మధ్య నేపాల్‌లో పర్యటించనున్నారు. రక్షణ, భద్రతా అంశాలపై అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. నేపాల్​ రక్షణ మంత్రి ఈశ్వర్​ పోఖ్రెల్​, ఆర్మీ చీఫ్​ పూర్ణ చంద్ర థాపాతోనూ.. నరవాణే భేటీ కానున్నారు.

మూడు రోజుల పర్యటనలో..

నవంబర్​ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటనలో భారత-నేపాల్​ మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు చర్చలు జరగనున్నాయి. 1950లో ప్రారంభమైన పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జనరల్​ నరవాణేకు నేపాల్​ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి 'జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ' గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం కాఠ్మాండులో జరగనుంది. భారత్ కూడా 'జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ' గౌరవ ర్యాంకును నేపాల్ ఆర్మీ చీఫ్‌కు ప్రదానం చేస్తుంది.

ఈ మధ్య కాలంలో ఇరుదేశాలకు సరిహద్దులు సహా నూతన మ్యాప్​ విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఇరువురికీ దాదాపు 1800 కి.మీ మేర సరహద్దు ఉంది. వాటిపైనా చర్చలు జరగనున్నాయి.

కొత్త మ్యాప్​​ తర్వాత తొలిసారి...

భారత్​లోని లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్​ కొత్త మ్యాప్​ను విడుదల చేశాక.. ఇరుదేశాల మధ్య జరుగుతున్న తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే.

సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు నెరిపేందుకు నరవాణే పర్యటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ మయన్మార్​, మాల్దీవులు, బంగ్లాదేశ్​, శ్రీలంక, భూటాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల్లో పర్యటించి పలు అంశాల్లో భారత్​ వైఖరిని తెలియజేశారు. ఈ నెలలోనే మయన్మార్​ వెళ్లిన నరవాణే.. ఆ దేశ​ అగ్రనేత, స్టేట్ కౌన్సెలర్​ ఆంగ్​ శాన్​ సూచీతో భేటీ అయ్యారు. అనంతరం ఆ దేశానికి న్యూక్లియర్​ సబ్​మెరైన్​ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇరుదేశాల మధ్య సైనిక, రక్షణ సంబంధాల మెరుగుదలకు కృషి చేశారు.

నేపాల్​ ప్రత్యేకమే..

సరిహద్దుల్లో ఒత్తిడి పెంచుతున్న చైనా.. భారత సరిహద్దు దేశాలను తమ వైపు తిప్పుకొని మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్​తో కలిసి రెండు వైపుల నుంచి దాడి చేస్తున్న చైనా.. నేపాల్​లోనూ కాలుమోపి త్రిముఖ దాడి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఈ హిమాలయ దేశంలో పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. వాటిపై నేపాల్​ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అయితే చైనాకు దీటైన ప్రత్యర్థి మనమే కావడం వల్ల.. నేపాల్​కు అండగా ఉండి ఈ విషయంలో ​కీలకంగా వ్యవహరించనుంది భారత్​.

సముద్రం లేని నేపాల్​ సరకు రవాణా కోసం ముఖ్యంగా భారత్​పైనే ఆధారపడుతుంది. అందుకే ఇరుదేశాల మధ్య వాణిజ్యం కీలకంగానే ఉంది. 2017లో దాదాపు 420.18 మిలియన్​ డాలర్ల విలువైన వస్తువులను భారత్​కు సరఫరా చేసి ఆర్థికంగానూ బలపడింది నేపాల్​.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.