Kejriwal Challenges Modi : భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేతలందరూ ఆదివారం వస్తారని, మోదీ ఎవరినైనా జైలుకు పంపవచ్చని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సవాల్ విసిరారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్లను కూడా జైలుకు పంపుతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. అందుకే తామే బీజేపీ ఆఫీస్కు వస్తామని తమను జైలుకు పంపాలని కేజ్రీవాల్ అన్నారు.
బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన తర్వాత మాట్లాడిన కేజ్రీవాల్, తమ పార్టీ నేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్ను అణచి వేయలేరని అన్నారు. మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను జైలుకు పంపారని, ఇప్పుడు మరికొందరిని జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ ఎంత మంది ఆప్ నేతలను జైలులో పెట్టిందో దానికి రెట్టింపు సంఖ్యలో నాయకులు పుట్టుకొస్తారని అన్నారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై దాడి కేసుపై కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అరెస్టు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందంటూ, స్వాతిపై దాడి చేసినట్లు ఆరోపణలున్న బిభవ్ కుమార్ అరెస్టును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలుచేశారు. అరెస్టుల ద్వారా ఆమ్ఆద్మీ పార్టీని అణిచివేయడం బీజేపీ సాధ్యం కాదని ధీమా వ్యక్తంచేశారు. దిల్లీలోమంచి పాఠశాలలను నిర్మించడం, మొహల్లా క్లినిక్ల ద్వారా 24 గంటల ఉచిత వైద్యం అందించడం తాము చేసిన తప్పా అని.. కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది.
డ్రామాలు ఆపండి: బీజేపీ
దిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. "సొంత పార్టీ మహిళా నేతపై జరిగిన దాడిపై కేజ్రీవాల్ మౌనం వహిస్తున్నారు. మీరు చేస్తున్న డ్రామాలు ఇక ఆపండి. ఆమెపై దాడి జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు పెదవివిప్పడం లేదు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు?" అని బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ప్రశ్నించారు.