ETV Bharat / bharat

భారత్​-నేపాల్​ విభేదాలకు కారణాలు ఇవేనా?

author img

By

Published : Jun 15, 2020, 1:35 PM IST

INDONEPAL-BORDER-LD EXPERTS
భారత్​- నేపాల్

ఏడు దశాబ్దాల సాంస్కృతిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలు.. స్వేచ్ఛా సరిహద్దు ఒప్పందాలు.. ఇలా అన్నింటికీ స్వస్తి పలుకుతూ భారత్​తో విభేదాలను పెంచుకుంటోంది నేపాల్​. వివాదాస్పద మ్యాపును రూపొందించి భారత్​కు సవాలు విసురుతోంది. ఉన్నట్టుండి నేపాల్​ ఈ విధంగా వ్యవహరించటంపై చైనా ఆర్థిక ప్రోత్సాహంతోపాటు అంతర్గత రాజకీయ ప్రయోజనాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్​ చిన్న చూపు కూడా ఇందుకు దోహదం చేసిందని మరికొంతమంది వాదిస్తున్నారు.

భారత్​- నేపాల్ మధ్య​ బ్రిటీష్ కాలం నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. దశాబ్దాలుగా సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలతో పెనవేసుకుపోయాయి. నేపాల్​తో భారత్​కున్న ఇలాంటి ప్రత్యేక బంధం మరే దేశంతోనూ లేదు. కానీ, కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలపై ఎన్నడూ లేనంతగా నేపాల్ స్పందిస్తోంది. భారత భూభాగంలోని కాలపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను కలుపుకొని కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది.

కాఠ్​మాండూ​ వైఖరిలో ఒక్కసారిగా ఎందుకింత మార్పు? రెండు దేశాల మధ్య ఉన్న చిన్నపాటి స్పర్థలను జటిలం చేయటానికి కారణాలేంటి? దీని వెనుక చైనా హస్తం ఉందా? చైనా ఆర్థిక మద్దతుతో భారత్​తో నేపాల్​ వ్యవహార శైలి మారిందా? ఈ పరిణామాలపై నిపుణులు ఏమంటున్నారు?

చైనా మద్దతు..

తాజా పరిణామాలకు కారణం నేపాల్​కు చైనా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా అందిస్తోన్న మద్దతుతో నేపాల్​లో ఆకాంక్షలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు ఇంత సంక్లిష్ట స్థితికి చేరుకునేందుకు రెండు దేశాలు కారణమని నేపాల్​లో భారత రాయబారిగా పని చేసిన రాకేశ్ సూద్​ అన్నారు.

"రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇందుకు రెండు దేశాలూ కారణమయ్యాయి. నేపాల్​తో భారత్​ చర్చలు జరపాల్సి ఉంది. గతేడాది నవంబర్​లో నేపాల్ ప్రతిపాదించిన చర్చలకు భారత్​ సమయం కేటాయించాలి. మనం సరైన శ్రద్ధ వహించలేదేమోనని నా భావన. కానీ, నేపాల్ మళ్లీ తిరిగి రానంత లోతుకు​ తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది. "

- రాకేశ్​ సూద్​, మాజీ దౌత్య అధికారి

భారత్​తో నేపాల్​కు 1,850కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సిక్కిం, బంగాల్​, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. సరిహద్దు ప్రజల స్వేచ్ఛా రవాణా సంప్రదాయంగా కొనసాగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. సుమారు 80 లక్షల మంది నేపాలీ పౌరులు భారత్​లో జీవిస్తూ ఉపాధి పొందుతున్నారు.

అంతేకాదు, రెండు దేశాల మధ్య దృఢమైన రక్షణ, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నేపాల్​కు భారతే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2018-19 సంవత్సరంలో రూ.57,858 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. సుమారు 32 వేల మంది నేపాలీ గూర్ఖాలు భారత సైన్యంలో సేవలు అందిస్తున్నారు.

ఓలీ రాజకీయ లబ్ధి..

రాజకీయ ఉద్దేశంతోనే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ నిర్ణయం తీసుకున్నారని 2013-17 మధ్య నేపాల్​లో దౌత్య అధికారిగా పనిచేసిన రంజిత్​ రే అభిప్రాయపడ్డారు. దేశీయ రాజకీయాల్లో సమస్యలను అధిగమించి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకే ఓలీ కొత్త మ్యాపును తీసుకొచ్చారని తెలిపారు.

"భారత్​ వ్యతిరేక భావజాలమే ఎన్నికల్లో ఓలీ విజయానికి కారణమైంది. దేశీయంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఓలీకి మళ్లీ ఇదే అంశం సహాయపడుతుందని భావిస్తున్నారు. నేపాల్​లో ఆయన పదవిపై అభద్రతా భావంతో ఉన్నారని నా అభిప్రాయం.

ఆర్థిక పురోగతి, కరోనా సంక్షోభంలో ప్రభుత్వం విఫలమైందని నేపాల్​లో చాలా మంది ఆందోళనలు చేస్తున్నారు. నేపాల్​ కమ్యూనిస్టు పార్టీలోనే ప్రధానిగా ఓలీని దించే అవకాశముందని వదంతలు వస్తున్నాయి. నాకు తెలిసి సరిహద్దు అంశమే ఇప్పుడు ఓలీకి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, వివాదాస్పద మ్యాపును రూపొందించి రెండు దేశాల మధ్య సమస్యను మరింత జటిలం చేసింది నేపాల్."

- రంజిత్ రే, నేపాల్​లో మాజీ దౌత్య అధికారి

1997నుంచి పెండింగ్​లో ఉన్న ఈ సమస్యపై చర్చలకు నవంబర్​లో నేపాల్ ప్రతిపాదించింది. అయితే కరోనా సంక్షోభం తర్వాత సిద్ధమని భారత్ జవాబు ఇచ్చింది. అయినప్పటికీ, వివాదాస్పద మ్యాపునకు సంబంధించి నేపాల్​ తొందరపడిందని, అంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సన అవసరం లేదని అన్నారు రంజిత్ రే.

భారత్​ విధించిన ఆంక్షలు..

2015లో ఆర్థికపరమైన ఆంక్షల వల్ల భారత్​తో నేపాల్​ సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదనుగా నేపాల్​కు అప్పటి నుంచి చైనా ఆర్థికంగా సహకరిస్తోంది. భారత్ ఆంక్షలతో దారులు మూసుకుపోయిన నేపాల్​ను చైనా తన నగరాలకు అనుసంధానం చేసింది. పెట్రోలియం, ఇతర అత్యవసర వస్తువులను ఎగుమతులు ప్రారంభించింది. ఫలితంగా దిల్లీపై కాఠ్​మాండూ ఆధారపడటం తగ్గించింది.

అంతేకాదు, కాఠ్​మాండూ నుంచి టిబెట్​లోని షిగేసేకు రైల్వే లైన్​ను నిర్మించేందుకు చైనా ప్రణాళికలు వేస్తోంది. వస్తు రవాణాకు నాలుగు నౌకాశ్రయాలను వాడుకునేందుకు నేపాల్​కు అనుమతిచ్చింది.

డ్రాగన్​ ప్రోత్సాహం..

భారత్​తో నేపాల్​ విభేదాలకు చైనా మరింత ఆజ్యం పోస్తోందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ ఎస్​డీ ముని అభిప్రాయపడ్డారు. భారత్​తో కయ్యానికి దిగేలా నేపాల్​ను ఉసిగొల్పుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం నేపాలీలు వ్యవహరిస్తున్న తీరును చూస్తే పాత సంబంధాలు, ప్రత్యేక అనుబంధాన్ని పూర్తిగా తెంచుకుంటున్నారని స్పష్టమవుతోందన్నారు ముని.

"ఇప్పుడున్నది కొత్త నేపాల్. దేశంలో 65 శాతం మంది యువకులే ఉన్నారు. వాళ్లు ఇప్పుడు దేని గురించి ఆలోచించట్లేదు. వారి ఆకాంక్షలు భిన్నమైనవి. వాటికి తగినట్లు భారత్​ లేకుంటే వాళ్లు పట్టించుకునే అవకాశం లేదు. నేపాల్​తో భిన్నంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొంత సున్నితత్వం, మరికొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. "

- ఎస్​డీ ముని, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు

చర్చలు జరపాల్సింది..

కొత్త మ్యాప్​ కోసం రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాదేశిక అంశాలను నేపాల్​ వివాదాస్పదం చేస్తోందని రాకేశ్ సూద్ ఆరోపించారు. దీనిపై చర్చకు ఆస్కారం లేకుండా నేపాల్ ప్రవర్తిస్తోందన్నారు.

"చైనా, పాక్​తో భారత్​కు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కానీ నేపాల్​తో బ్రిటిష్​ కాలం నుంచి స్వేచ్ఛా సరిహద్దు ఒప్పందాలు ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. దీనికి ఏకైక పరిష్కారం దౌత్య చర్చల మాత్రమే. నేపాల్​పై చైనా ప్రభావం పెరిగినా ఈ పరిస్థితుల వెనుక డ్రాగన్ హస్తం ఉందని నేను అనుకోను. నాకు తెలిసి నేపాల్​ చర్చలకు ఆహ్వానించిన భారత్​ స్పందించకపోవటమే ఇందుకు కారణం కావచ్చు" అని రాకేశ్ అభిప్రాయపడ్డారు.

"మన ప్రధాని సుమారు 50 మంది విదేశీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విదేశాంగ మంత్రి 70 మందితో చర్చించారు. ఇదే స్థాయిలో నేపాల్​తోనూ చర్చలు జరపవచ్చు. కానీ అలా జరగలేదు."

- రాకేశ్ సూద్​, మాజీ దౌత్యవేత్త

రాకేశ్​ వాదనతో ముని కూడా ఏకీభవించారు. చిన్న పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో భారత్​ అలసత్వం, అతి విశ్వాసం ప్రదర్శిచిందని అభిప్రాయపడ్డారు. నేపాల్​ విషయంలో భారత్​ కూడా తప్పులు చేసిందని, కానీ వీటిని పరిష్కరించేందుకు సమయం కేటాయించాలని సూచించారు.

ఇదీ చూడండి: కొత్త మ్యాప్​కు నేపాల్​ పార్లమెంట్​ ఆమోదం.. స్పందించిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.