బంగాల్లోని కోల్కత్తాలో కేవలం 6 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఏకంగా రూ.9,200 డిమాండ్ చేశాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. అంత సొమ్ము తాము చెల్లించలేమని బాధితులు వాపోగా.. తన వాహనం నుంచి దిగిపొమ్మన్నాడు ఆ వాహనదారుడు. చివరకు అక్కడి వైద్యులు జోక్యం చేసుకొని సర్దిచెప్పగా.. రూ. 2,000లకు తగ్గాడు.
అసలేం జరిగిందంటే.?
కోల్కతాలోని ఓ ప్రాంతంలో తొమ్మిది నెలలు, తొమ్మిదన్నరేళ్ల వయసున్న ఇద్దరు సోదరులు అనారోగ్యంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్(ఐసీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారివురికీ పాజిటివ్గా నిర్ధరణ అయింది. వారిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రిలో తరలించే ప్రయత్నం చేశాడా తండ్రి.
ఐసీహెచ్ నుంచి స్థానిక మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్.. రూ.9,200 భారీ మొత్తాన్ని ఇవ్వాలని కోరినట్లు ఆ తండ్రి చెప్పాడు. అంత సొమ్ము తాను ఇచ్చుకోలేనని వేడుకొన్నా.. డ్రైవర్ పట్టించుకోలేదన్నాడు.
ఇంతలో.. అంబులెన్స్లో ఉన్న తన చిన్న కూమారుడికి ఆక్సిజన్ తీసేసి, తన భార్యను బలవంతగా వాహనం నుంచి దింపారని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే... అక్కడి వైద్యులు కలగజేసుకొని తనకు మద్దతు పలికారని బాధితుడు తెలిపారు. ఆ వైద్యుల కారణంగానే తన కుమారులకు ఇప్పుడు కేఎంసీహెచ్లో మెరుగైన చికిత్స అందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరు: ఒక్కరోజే 4 లక్షలకు పైగా టెస్టులు