ETV Bharat / bharat

'నాకు జీతం ఇస్తోంది నీకు సెల్యూట్‌ చేయడానికి కాదు'.. ఆంగ్లేయులకు లొంగని కొత్వాల్

author img

By

Published : Jul 15, 2022, 7:14 AM IST

Updated : Jul 15, 2022, 7:58 AM IST

'అవును మిత్రమా.. ఎక్కడో ఒకచోట బతికే ఉందాం.. అది స్వతంత్ర భారతంలోనా, స్వర్గంలోనా అనేది కాలమే నిర్ణయిస్తుంది' వింటే చాలు.. నరనరాల్లో జివ్వున రక్తం ఉప్పొంగించే ఈ మాటలన్నది ఎవరో కాకలుతీరిన గొప్ప నాయకుడు కాదు.. తల్లి భారతిని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయడానికి తన జీవితాన్ని సమిధగా చేసిన ఓ సామాన్యుడు. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి.. తన చిన్న జీవితానికి గొప్ప ఆశయాన్ని నిర్దేశించుకుని అసామాన్యుడయ్యారు. ఆయనే.. అన్నాసాహెబ్‌ విఠల్‌రావ్‌ లక్ష్మణ్‌ ఉరఫ్‌ భాయ్‌ కొత్వాల్‌.

azadi ka amrit mahotsav
ఆజాదీ కా అమృత్ మహెత్సవ్

ముంబయి సమీపంలోని పర్వత ప్రాంతమైన మాథేరాన్‌లో 1912 డిసెంబరు 1న అన్నాసాహెబ్‌ విఠల్‌రావ్‌ లక్ష్మణ్‌ జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం. చిన్ననాటి నుంచే గణితంలో ప్రతిభ చూపిన విఠల్‌రావ్‌ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. మాథేరాన్‌లో నాల్గో తరగతి వరకు చదివాక, విఠల్‌రావ్‌ పుణెలోని తన మేనత్త ఇంటికి వెళ్లి అక్కడే డిగ్రీ పూర్తిచేశారు. సొంతూరుకు తిరిగొచ్చాక న్యాయవిద్యను అభ్యసించి ముంబయిలో న్యాయవాదిగా మారారు. 1935లో ఇందు తిర్లపుర్కర్‌తో వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె పుట్టారు.

నేను కాదు.. మీరే వెళ్లిపోయే రోజొస్తుంది: పుణెలో విఠల్‌రావ్‌కు తుకారాం అనే వైద్యుడు చదువు చెప్పించి, నెలకు రూ.50 జీతంతో కొత్వాల్‌ ఉద్యోగాన్ని ఇప్పించారు. ఠాణాలో రోజూ ఉదయమే వచ్చే తెల్లదొరకు ఉద్యోగులంతా సెల్యూట్‌ చేస్తుండగా విఠల్‌రావ్‌ పట్టించుకునే వారు కాదు. దీనిపై అధికారి ప్రశ్నించగా.. 'ప్రభుత్వం నాకు జీతం ఇస్తోంది.. నీకు సెల్యూట్‌ చేయడానికి కాదు' అని కరాఖండిగా సమాధానమిచ్చారు. ఆగ్రహించిన తెల్లదొర 'ఉద్యోగం నుంచి వెళ్లిపో' అంటూ ఆదేశించారు. 'నేను కాదు.. మీరే మా భారతావని నుంచి వెళ్లిపోయే రోజు దగ్గర్లోనే ఉంది' అంటూ హెచ్చరిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటి నుంచి విఠల్‌రావ్‌ పేరు కొత్వాల్‌గా స్థిరపడిపోయింది. ముంబయి వచ్చాక సహచరులు ఆయన్ని భాయ్‌ కొత్వాల్‌గా పిలవడం ప్రారంభించారు.

రైతులకు అండగా ధాన్యం బ్యాంకులు: తనను ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా కష్టాల్లో ఉన్నవారికి భాయ్‌కొత్వాల్‌ చేతనైనంత సాయం చేసేవారు. తుపానుతో నిర్వాసితులైన జాలర్లను నాటి కాంగ్రెస్‌ నేత రాజారాం రౌత్‌తో కలిసి ఆదుకున్నారు. చదువు రాని రైతుల పిల్లల కోసం 42 పాఠశాలలను తెరిచారు. కరవు సమయంలో రైతులు, కూలీలను భూస్వాములు వదిలేయగా.. రౌత్‌ చేయూతతోనే విఠల్‌రావ్‌ వేల కిలోల ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నారు. ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేసి, రైతులకు తిండిగింజలనే అప్పుగా పంపిణీ చేశారు. రైతులు.. పంట పండిన తర్వాత తాము తీసుకున్న దానికి 25% కలిపి మొత్తాన్ని మళ్లీ ధాన్యం బ్యాంకులోనే అప్పగించాల్సి ఉంటుంది. ఈ విధానం అన్నదాతలను ఎంతగానో ఆదుకుంది. తరచూ శిబిరాలు నిర్వహించి.. ప్రజల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించారు. ఆయన చేసిన సేవల ఫలితంగా 1941లో మాథేరాన్‌ మున్సిపాలిటీకి ఉప ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

విద్యుత్తు సరఫరాకు ఆటంకం: క్విట్‌ ఇండియా ఉద్యమం(1942)లో పాల్గొన్నందుకు తన పేరిట అరెస్టు వారెంటు జారీ కావడంతో భాయ్‌ కొత్వాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. బ్రిటిష్‌ సైనికుల కోసం ముంబయి పరిసరాల్లోని కంపెనీలలో మందుగుండు సామగ్రిని, తుపాకులను తయారు చేస్తుండటాన్ని గుర్తించారు. కంపెనీలకు విద్యుత్తు సరఫరాను నిలిపేస్తే వాటిలో ఉత్పత్తి ఆగిపోతుందని.. దీనివల్ల అంతిమంగా ఇంగ్లండ్‌కు హాని జరుగుతుందని 'కొత్వాల్‌ దస్తా' పేరిట దళాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు 1942 సెప్టెంబరు-నవంబరు మధ్య 11 భారీ విద్యుత్తు సంభాలను కూల్చేశారు. కంపెనీలు నడవకుండా చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన పోలీసులు భాయ్‌ కొత్వాల్‌ను సజీవంగా పట్టుకున్నా లేదా చంపినా పట్టుకుంటే రూ.2500 నజరానా ఇస్తామని ప్రకటించారు. ప్రత్యేక అధికారిగా డీఎస్పీ హాల్‌ను నియమించారు. వారికి దొరక్కుండా కొత్వాల్‌ దస్తా దళం సింధ్‌గఢ్‌ అడవుల్లో తలదాచుకుంది. 1943 జనవరి 2న తెల్లవారుజామున ఒక ద్రోహి మోసం చేయడంతో పోలీసులు వారి స్థావరాన్ని చుట్టుముట్టారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో హీరాజిపాటిల్‌ అనే యువకుడు అమరుడయ్యారు. తర్వాత భాయ్‌ కొత్వాల్‌ తొడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లగా కదలలేని స్థితిలో పడిపోయారు. వెంటనే డీఎస్పీ హాల్‌ భాయ్‌ కొత్వాల్‌ తలపై పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చాడు. ఇలా దేశం కోసం విఠల్‌రావ్‌ అమరుడయ్యారు.

ఇవీ చదవండి:

స్విట్జర్లాండ్ మహిళ.. భారత స్వాతంత్ర్యోద్యమంలో వీర వనిత!

వ్యాపారమే కాదు.. బ్రిటిష్​పై పోరాటంలోనూ ముందున్న 'బిర్లా'

Last Updated :Jul 15, 2022, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.