ETV Bharat / bharat

రామమందిరం ఓపెనింగ్​కు ముహూర్తం ఫిక్స్​.. మోదీ సహా ప్రతిపక్షాలకు ఆహ్వానం!

author img

By

Published : Aug 5, 2023, 9:18 AM IST

Updated : Aug 5, 2023, 10:20 AM IST

Ayodhya Ram Mandir Opening Date : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించినట్లు పేర్కొంది.

ayodhya ram mandir opening date
ayodhya ram mandir opening date

Ayodhya Ram Mandir Opening Date : ఉత్తర్​ప్రదేశ్​లోని.. అయోధ్యలో నిర్మితమవుతున్న నూతన రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి తర్వాత జనవరి 21, 22, 23 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

ram mandir ayodhya Narendra Modi : రామ్​లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ప్రముఖ సాధువులు, ఇతర అతిథులతో పాటు రావాలనే ఉద్దేశం ఉన్న ఇతర రాజకీయపార్టీల నేతలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక వేడుక జరుగుతుందన్నారు. రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో వేదిక కానీ బహిరంగసభ కానీ ఉండదని పేర్కొన్నారు.

136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది మతపెద్దలను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్​ తెలిపారు. ఆ జాబితా సిద్ధమైన తరువాత ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నిత్య గోపాల్‌దాస్‌ సంతకంతో వారికి ఆహ్వాన పత్రాలు పంపిస్తామన్నారు. వచ్చిన సాధువులకు మఠాల్లో ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. 10వేల మంది సాధువులు ఆలయ పరిసరాల లోపల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని చంపత్​ రాయ్‌ తెలిపారు.

Ayodhya Ram Mandir Construction Status : 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ నిర్వహించారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు. ఆలయంలోని రామ్‌లల్లా గర్భగుడి నిర్మాణం శరవేగంగా పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివస్తారని ట్రస్టు భావిస్తోంది.

హోటళ్లు, రిసార్టులు హౌస్​ఫుల్​..
అయోధ్య రామమందిర నిర్మాణం చకచకా సాగుతున్న వేళ.. ఆ ప్రదేశం పర్యాటక శోభ సంతరించుకునేందుకు ముస్తాబవుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మరో 6 నెలల సమయం ఉండగానే.. అక్కడి హోటళ్లు, రిసార్టులకు అడ్వాన్సు బుకింగ్‌లు పోటెత్తుతున్నాయి. అపూర్వ ఘట్టమైన విగ్రహ ప్రతిష్ఠాపనను కళ్లారా చూసేందుకు భక్తులు ఆన్‌లైన్‌, ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా గదులు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :Aug 5, 2023, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.