ETV Bharat / bharat

చంద్రబాబు క్వాష్ పిటిషన్​పై హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 5:16 PM IST

Updated : Sep 19, 2023, 7:36 PM IST

Chandrababu Quash Petition
Chandrababu Quash Petition

16:52 September 19

Chandrababu Quash Petition ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన వాదనలు

Chandrababu Quash Petition : స్కిల్‌ కేసులో తనపై నమోదైన F.I.R.తో పాటు A.C.B. కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులను... రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై... హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు... వాదనలు సాగాయి. ఇరుపక్షాలు సుధీర్ఘంగా తమ తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును.. రిజర్వు చేశారు. గురువారం తీర్పును వెల్లడిస్తామని తెలిపారు.

Skill Development Case Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌

స్కిల్ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌పై చంద్రబాబు తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో F.I.R.పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారని... అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌-17A కింద తగిన అనుమతులు తీసుకోలేదని అన్నారు. ఈ FIR చట్టవిరుద్ధమైనదన్నారు. గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారని... సెక్షన్‌ 17A పూర్తి వివరాలు తెలిసినా అనుమతులు తీసుకోలేదని గుర్తుచేశారు. స్టేట్ ఆఫ్‌ రాజస్థాన్‌ - తేజ్‌మల్ చౌదరి కేసును సాల్వే ఉదహరించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది కాకుండా, దర్యాప్తు సమయంలో ఉన్న చట్టబద్ధతను పరిగణించాలన్నారు. కేసు పెట్టేందుకు మూలమైన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని సెక్షన్‌ 17A వర్తిస్తుందని... స్కిల్‌ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇప్పుడు పదవిలో లేనందున ఆ నిబంధన వర్తించదనడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదన్నారు. పాత ప్రభుత్వంపై కొత్త ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడకుండా చట్టంలో ఈ నిబంధన పొందుపరిచిన విషయాన్ని ప్రస్తావించారు.

NSG Report on Chandrababu Security: చంద్రబాబు అరెస్టుపై కేంద్ర హోంశాఖకు ఎన్​ఎస్​జీ నివేదిక.. భద్రతా వైఫల్యాలు ప్రస్తావన

2024 ఎన్నికలు కనుచూపు మేరలో కనిపిస్తున్న వేళ... చంద్రబాబుపై నమోదైన కేసును కచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలని సాల్వే అన్నారు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతున్నందున ఈ కేసును ఏకపక్షంగా చూడకూడదని.. ఇక్కడే హైకోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించాలని కోరారు. ఇదే కేసుకు సంబంధించిన G.S.T ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించిందన్నారు. ఈ కేసుకు ఆధారమైన ప్రాజెక్టు ఖర్చులో 90 శాతం ప్రైవేటు సంస్థలు, 10 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని... యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకే ప్రాజెక్టును చేపట్టారని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మదింపు నివేదికను హరీశ్ సాల్వే చదివి వినిపించారు. నగదు అంశం మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినదని... మిగతావన్నీ ప్రైవేటు సేవలేనని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన భూమి, అనుమతులతోపాటు 330 కోట్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారని... ఇది ప్రాజెక్టు విలువలో దాదాపు 10 శాతానికి సమానమని వివరించారు. మొత్తం ప్రాజెక్టులో రాష్ట్ర భాగస్వామ్యం చాలా స్వల్పమని, ప్రైవేటు సంస్థలదే అధిక బాధ్యతని అన్నారు. ఒప్పందం తర్వాత ఎవరేం చేయాలనే దానిపైనా అంగీకారపత్రం తీసుకున్నారని... ఆమేరకు ప్రతిపాదించిన ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రభుత్వానికి అందించారని సాల‌్వే వాదించారు. తమ అనుబంధ సంస్థే స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీమెన్స్‌ స్పష్టం చేసిందన్న సాల్వే... వాటిని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించాక ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు.

AP Police Special Rules : నేరారోపణ లేకుండానే జైలు..! ఇదీ ఏపీలో తాజా పరిస్థితి

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయని సాల్వే గుర్తుచేశారు. ఒకవేళ ఇన్‌వాయిస్‌లు పెంచి చూపించారన్నా... అది అంతర్గత అంశమే అవుతుందన్నారు. దీనికి అప్పటి సీఎం ఎలా బాధ్యులవుతారన్నారు. ఇది కేవలం సెంట్రల్‌ వ్యాట్‌ ఇష్యూ మాత్రమేనని... ట్యాక్స్ అంశంపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు ఎలా పెడతారని అడిగారు. ఈ కేసులో ముందే చెప్పినట్లు సెక్షన్‌ 17A కచ్చితంగా వర్తిస్తుందని... కేసు నమోదు చేసినవారు ముందస్తు అనుమతి తీసుకోలేదని పునరుద్ఘాటించారు. కేవలం ఒక మెమో ఆధారంగా మాజీ సీఎంను నిందితుడిగా చేర్చారని.. ఈ ఫిర్యాదే ఒక అభూతకల్పన అని వాదించారు. ఈ ప్రాజెక్టుకు కట్టిన విలువ సరసరమైనదని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెబుతుంటే... ఫిర్యాదులో మాత్రం ప్రైవేటు సంస్థలు లాభాలు దండుకున్నట్లు పేర్కొన్నారని వివరించారు. ఈ కేసులో సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులను 'హెంచ్‌మెన్‌' అని ఎలా సంభోదిస్తారన్న చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే... ఫిర్యాదులో 'అపాయింటెడ్ హెంచ్‌మెన్‌' అని సంభోదించవచ్చా అని ప్రశ్నించారు. సివిల్ సర్వీస్ అధికారుల పట్ల ఫిర్యాదులో పేర్కొన్న భాష ఆశ్చర్యానికి గురిచేస్తోందన్న ఆయన... పోలీసు అధికారులను మనం 'హెంచ్‌మెన్' అని ప్రస్తావించవచ్చా అంటూ నిలదీశారు.

Chandrababu Bail petition in ACB court: చంద్రబాబుకు బెయిల్​పై ఏసీబీ కోర్టులో పిటిషన్.. రేపు విచారణ

చంద్రబాబును అరెస్టు చేసి విచారణ కొనసాగుతున్నందున... ఈ కేసును ఇప్పుడే తీసుకోవద్దని CID తరఫు వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హైకోర్టును కోరారు. ఈ కేసులో 17A వర్తించదని అన్నారు. సివిల్‌ సర్వీసు అధికారి సంతకం చేసినందున స్కామ్‌ అనకుండా ఉండలేమన్న రోహత్గీ... ఈ కేసులో పోలీసులతోపాటు పన్నుల శాఖ, P.M.L.A దర్యాప్తు జరుగుతోందన్నారు. 2018కి ముందే ఈ కేసులు సంబంధించి మూలాలు ఉన్నందున... 2018 నాటి చట్టసవరణ వర్తించదన్నారు. F.I.R మాత్రమే సంపూర్ణమైన కేసు డాక్యుమెంట్ కాదన్న రోహత్గీ.. దర్యాప్తు క్రమంలో ఇతర నిందితులను చేర్చవచ్చని అన్నారు. రెండు కంపెనీలు, ప్రభుత్వ సంస్థ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో... ప్రైవేటు సంస్థ సిద్ధం కాకుండానే 300 కోట్లు బదిలీ చేశారన్నారు. ఈ సమయంలో స్కిల్ వ్యవహారంలో సబ్‌ కాంట్రాక్టులను ఎవరు నియమించారు, ఎంపికలో పిటిషనర్‌ పాత్ర ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది.

Siddhartha Luthra will Argue on Chandrababu Arrest చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సిద్దార్థ లూథ్రా

తర్వాత వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్‌సాల్వే... ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ వాదన ఆశ్చర్యానికి గురిచేసేలా ఉందన్నారు. ప్రాసిక్యూషన్‌ వాదన ప్రకారం మాజీ సీఎం ఆర్డర్‌ పాస్‌ చేసి సొంత మనుషులను ఛైర్మన్లుగా పెట్టుకున్నట్లు చెబుతున్నారని... మాజీ సీఎం బేరసారాలు జరిపి నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారని... ఈ వాదనే అసంబద్ధం, అర్థం లేనిదని తెలిపారు. 2018తర్వాత నమోదైన అన్ని FIRలకు 17ఏ వర్తిస్తుంది.. ప్రొసీజర్‌ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని చెప్పారు. FIR చదివితే ఒక్క ఆరోపణ కూడా కనిపించట్లేదన్న సాల్వే... ఒక వ్యక్తిని అణచివేసేందుకు రాజ్యం తన శక్తిని వినియోగించకూడదని వాదించారు. ప్రాసిక్యూషన్‌ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయని... ఒకటి అడుగుతుంటే మరోటి చెబుతున్నారని తెలిపారు. ఒప్పందంలో ప్రైవేటు సంస్థలు ఒక్క రూపాయి నగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదని... 90 శాతం వాళ్ల భాగం విజయవంతంగా పూర్తిచేశారని స్పష్టంచేశారు. పన్నులను తగ్గించుకునేందుకు డిజైన్‌టెక్‌ ప్రయత్నం చేసినట్లు ఉందని... అక్కడే అసలు సమస్య ప్రారంభమైనట్లు ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్‌ను ఈ కేసులో భాగస్వామ్యం చేయడం దురుద్దేశపూర్వక చర్యని... ఇది 2024 ఎన్నికల రాజకీయ రణక్షేత్రమేనని... ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే అదే స్పష్టమవుతోందని స్పష్టం చేశారు. లావాదేవీల ప్రక్రియపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిగిందన్న ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్‌... డిజైన్‌టెక్‌ 200 కోట్లు మళ్లించినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రిపోర్టు వచ్చిందని తెలిపారు. ఒప్పందం జరిగిన నెల రోజుల తర్వాత స్కిల్లార్‌ కంపెనీ ఏర్పాటైందని... 178 కోట్ల విలువైన వస్తువులను స్కిల్లార్‌ నుంచి డిజైన్‌టెక్‌ కొన్నట్లు చూపిస్తోందన్నారు. కేసు డైరీ ప్రకారం ఇవి 2015-16లో జరిగిన లావాదేవీలు కాబట్టి... 2018 సవరణ చట్టం వర్తించదని వాదించారు.

Chandrababu Case Arguments : చంద్రబాబుపై కేసు రాజకీయ ప్రేరేపితం.. ఆధారాల్లేకుండానే సెక్షన్-409 ఎలా..? : సిద్ధార్థ లూథ్రా

తర్వాత వాదనలు వినిపించిన సిద్దార్థలూథ్రా... 2021లో ఫిర్యాదు నమోదైందని... కేసులో అన్ని పరిణామాలు ఆ తర్వాతే జరిగాయని.. ఇప్పుడు 2018 ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ తరఫు వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని... ఒకసారి దర్యాప్తు ప్రారంభ దశలో ఉందంటారు.. ఒకసారి దర్యాప్తు 2018లోనే ప్రారంభమైందంటారని కోర్టు దృష్టికి తెచ్చారు. నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్లు కనబడట్లేదంటారని... కేసుకు సంబంధించిన ఫైళ్లను ధ్వంసం చేసి పిటిషనర్‌పై నిందారోపణలు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఏపీ ప్రభుత్వంలో పద్ధతి ప్రకారం పత్రాలు కనబడకుండా పోతున్నాయని చెప్పారు. ఈ కేసులో ఛైర్మన్ ఏ1 అయి ఉండి.. ఏ1 నిధులు విడుదల చేశారంటున్నారని... అది ఏ37 సూచనల మేరకు చేశారన్నది CID ఆరోపణనని... CID చెప్పిన వాదనల ప్రకారమే ఈ ఆరోపణలకు 17ఏ ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. కేసు వాదన సందర్భంగా రఫేల్‌ కేసులో జస్టిస్‌ జోసెఫ్‌ అభిప్రాయాన్ని ప్రస్తావించిన లూథ్రా... రఫేల్‌ కేసులోనూ కచ్చితంగా ఇలాగే జరిగిందని చెప్పారు.

Nara Brahmani Tweet I am with babu : 'ఆంధ్రా భవిష్యత్ కోసం నేను సైతం..' నారా బ్రాహ్మణి కీలక ప్రకటన!

సెక్షన్‌ 17ఏ ప్రకారమే తామ వాదిస్తున్నామని... అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకోవాలని లూథ్రా వాదించారు. నాలుగు అంశాలను కోర్టు ముందు ఉంచుతున్నానన్న లూథ్రా.... 17ఏపై సమాధానం లేదని జడ్జికి వివరించారు. ప్రభుత్వ చర్యలన్నీ కూడా 17ఏ కిందకే వస్తాయని... కేసులో 90:10 శాతంపై విపరీతమైన గందరగోళం ఉందని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు ఉదహరించిన తీర్పులేవీ కూడా ఆధారపడ్డదగినవిగా లేవని...కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు పూర్తవ్వడంతో... కోర్టు తీర్పును రిజర్వు చేసింది. గురువారం తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

Sidharth Luthra Tweet: న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమే.. సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్

Last Updated :Sep 19, 2023, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.