ETV Bharat / state

పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు.. ఒక్క పశ్చిమప్రకాశం నుంచే దాదాపు 50 వేల కుటుంబాల వలస

author img

By

Published : Jan 30, 2023, 7:23 AM IST

Migrations
వలసలు

Migration to Other States in Prakasam District: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో పనులు లేక గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పనుల కోసం పొట్ట చేతపట్టుకొని ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారు. భూమి లేక కొందరు, ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు పండించుకునేందుకు నీరు లేక మరికొందరు ఊళ్లను వీడుతున్నారు. ఆయా గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి.

Migration to Other States in Prakasam District: పశ్చిమ ప్రకాశంలోని.. కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో.. పనులు లేక కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్తున్నాయి. ప్రతి గ్రామంలో.. 20 నుంచి 30 శాతం మంది తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ముంబయి, పుణె, దిల్లీ, మధ్యప్రదేశ్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి.. కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు నెట్టుకొస్తున్నారు.

పశ్చిమ ప్రకాశం నుంచి దాదాపు 50 వేల కుటుంబాలు.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. ఇందులో ఒక్క కనిగిరి నియోజకవర్గం నుంచే 15 వేల కుటుంబాలు ఉన్నాయి. పీసీ పల్లి మండలం అన్నపురెడ్డిపల్లిలో వంద కుటుంబాలు ఉండగా ఇందులో 50కి పైగా కుటుంబాలు.. తెలంగాణ, కర్ణాటక, వలస వెళ్లాయి. సగానికి సగం ఇళ్లు తాళాలతో కనిపిస్తున్నాయి. భూమి లేని, తక్కువగా ఉన్న వారు.. వ్యవసాయం గిట్టుబాటు కాక పట్టణాలు, నగరాల బాట పట్టారు. అక్కడే ఏదో ఒక పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పండుగలకో, శుభకార్యాలకో మాత్రమే గ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్తుంటారు. దీంతో అనేక ఇళ్ల దగ్గర కేవలం వృద్ధులే కనిపిస్తుంటారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి.. మోపాడు, పాలేటిపల్లి రిజర్వాయర్లను నింపి.. సాగుకు అనుకూల పరిస్థితి కల్పిస్తే చాలా వరకు వలసలు తగ్గే అవకాశం ఉంది. కనిగిరి ప్రాంతంలో ఏర్పడిన నిమ్స్‌ పారిశ్రామికవాడను త్వరగా పూర్తిచేసి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. స్థానికంగానే పనులు చేసుకుంటామని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ బతకడానికి అవకాశాలు లేకనే ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వలసలతో ఖాళీ అవుతున్న గ్రామాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.