ETV Bharat / sports

టీమ్​ఇండియా క్రికెట్​లో ఓ శకం.. ధోనీ

author img

By

Published : Aug 15, 2020, 8:51 PM IST

భారత క్రికెట్​లో మరో అద్భుత కెప్టెన్ శకం ముగిసింది. సారథిగా ఎన్నో మరపురాని విజయాలు జట్టుకు అందించిన ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. తనదైన ముద్రవేస్తూ భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా నిలిచాడు. టీమ్​ఇండియాతో అతడి ప్రయాణంపై ప్రత్యేక కథనం.

Dhoni retirement
టీమిండియా క్రికెట్​లో ఓ శకం.. మహేంద్ర సింగ్ ధోనీ

కెప్టెన్ కూల్‌..! మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరైనా ఉపయోగించే మాట ఇది. భారత క్రికెట్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు పగ్గాలు అందుకున్నాడు. టీమ్​ఇండియాను అసమాన స్థాయికి చేర్చాడు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. ఐసీసీ టోర్నీలన్నింటిలో భారత్‌ను విజేతగా నిలిపాడు. టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలపడం సహా 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ను అందించాడు.

క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్​గా మారిన ధోనీ

జాన్ రైట్‌ నేతృత్వంలో గంగూలీ సారథ్యంలో అలలా ఎగసిపడింది భారత క్రికెట్ జట్టు. ఆ తర్వాత కోచ్‌గా వచ్చిన గ్రెగ్ చాపెల్ హయాంలో పాతాళానికి జారింది. ఈ దశలో ఎదురైందే 2007 వన్డే ప్రపంచకప్ ఓటమి. ఆ సమయంలో టీమ్​ఇండియాలో సమూల మార్పులు చేసింది బీసీసీఐ. సీనియర్ల సూచన మేరకు వన్డే జట్టు పగ్గాలు ధోనీకి అప్పగించింది.

ధోనీ దగ్గర ఉండే ప్లాన్​ బీ

దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌(2007)లో భారత్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు ధోని. తనకున్న వనరులను సమర్థంగా ఉపయోగిస్తూ భారత్​ను ఫైనల్​కు చేర్చాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ప్లాన్ బీ గురించి కూడా ఆలోచించేవాడు ధోనీ. పాక్‌తో లీగ్ మ్యాచ్‌కు మందు బౌల్‌ అవుట్‌ ప్రాక్టీస్.. ఆ మ్యాచ్‌లో విజయానికి కారణమైంది. ఆ తర్వాత ఫైనల్‌లో అద్భుత వ్యూహాలతో దాయాదిపై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఆసీస్​ను వారిగడ్డపైనే ఓడించాడు..!

వన్‌డౌన్‌లో అద్భుతంగా ఆడుతున్న ధోనీ.. కెప్టెన్​ అయిన తర్వాత లోయరార్డర్​కు మారాడు. టెయిలండర్లతో ఆడుతూ గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సారథిగానూ బాధ్యతలు అందుకున్నాడు. ఆసీస్​ను వారిగడ్డపైనే ఓడించి సిరీస్ గెల్చుకున్నాడు.

అన్నింటా ధోనీదే కీలక పాత్ర

అనిల్ కుంబ్లే గైర్హాజరీతో 2008లో టెస్టు పగ్గాలు అందుకున్నాడు ధోనీ. 2009లో భారత్​ను టెస్టుల్లో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిపాడు. 2013లో ఆస్ట్రేలియాను వైట్‌ వాష్ చేసి, గత 40 ఏళ్లలో కంగారూలను వైట్‌వాష్ చేసిన జట్టుగా భారత్‌ను నిలిపాడు.

భారత్​ను విశ్వవిజేతగా నిలిపిన ధోనీ

ధోనీ.. వన్డే కెప్టెన్​గా మారిన తర్వాత టీమిండియా ఎక్కువగా వన్డే సిరీస్​లు గెల్చుకుంది. 2011లో భారత్‌ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో తనదైన వ్యూహాలతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు మహీ.

ధోనీని చూసి గంగూలీ ఆశ్చర్యం

2014లో టెస్టు సారథ్య బాధ్యతలు వదులుకున్నాడు ధోనీ. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించాడు. యువ వికెట్‌కీపర్లకు అవకాశమిచ్చేందుకు పొట్టి ఫార్మాట్​కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పటి నుంచి వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ వచ్చాడు. తూర్పు భారతం నుంచి గంగూలీ తర్వాత భారత జట్టు సారథిగా వచ్చిన ధోనీ.. ఇన్ని విజయాలు సాధించడం పట్ల గంగూలీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఛాంపియన్​లకే ఛాంపియన్​ ధోనీ

ధోనీ కెప్టెన్సీలో ఐసీసీ టోర్నీలు అన్నింటిలో భారత్ విజేతగా నిలిచింది. 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించాడు మహీ. 2010, 2016ల్లో ఆసియాకప్‌ గెల్చుకునేలా చేశాడు. వన్డేల్లో 100 విజయాలు అందుకున్న తొలి ఆస్ట్రేలియేతర సారథిగానూ రికార్డు నెలకొల్పాడు.

ఇది చూడండి అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.