ETV Bharat / international

జాబ్ వదిలేస్తామన్నందుకే 8 మంది దారుణ హత్య.. ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి..

author img

By

Published : Jun 7, 2023, 12:32 PM IST

వారంతా కాల్ సెంటర్ ఉద్యోగులు.. అమెరికాలో ఇంగ్లిష్ నేర్చుకొని స్వదేశంలో పనిచేసుకునేవారు.. తమ యజమానుల నిజస్వరూపం తెలుసుకొని ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.. కానీ వారు అనుకున్నది జరగలేదు.. కరుడుగట్టిన నేరస్థులైన యజమానులు వారిని దారుణంగా హత్య చేశారు.

mexico drug cartel killings
mexico drug cartel killings

కాల్ సెంటర్​ ఉద్యోగం నుంచి వైదొలిగేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది దారుణ హత్యకు గురయ్యారు. మెక్సికోలో గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని పనిచేసే హింసాత్మక డ్రగ్ ముఠాకు చెందిన కాల్​సెంటర్​లో మృతులు పనిచేస్తున్నారు. నెల రోజుల నుంచి తమ బంధువులు కనిపించడం లేదని మృతుల కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. గౌడల్​జరా నగరంలోని ఆఫీస్​కు వెళ్లిన వారంతా.. తిరిగి రాలేదని పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారణ చేస్తుండగానే గత వారం ప్లాస్టిక్ సంచుల్లో ముక్కలుగా నరికిన శరీర భాగాలు కనిపించేసరికి అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో శరీర భాగాలకు డీఎన్​ఏ టెస్ట్ నిర్వహించారు. ఇవన్నీ కనిపించకుండా పోయిన కాల్​ సెంటర్ ఉద్యోగులవేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.

అధికారిక సమాచారం ప్రకారం.. మే 20 నుంచి 22 మధ్య ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. అయితే, మొత్తంగా ఎంత మంది మృతుల శరీర భాగాలు గుర్తించామనే విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించలేదు. తమ పిల్లలు సాధారణ కాల్​ సెంటర్​లోనే పని చేస్తున్నారని భావించామని మృతుల కుటుంబసభ్యులు అంటున్నారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మృతులు పనిచేసే కాల్ సెంటర్​ను జలిస్కో న్యూ జనరేషన్ అనే డ్రగ్ స్మగ్లర్ల ముఠా నడిపిస్తోంది. మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్ ఇదే. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, కిడ్నాపింగ్​లు కాకుండా.. ఇతర చట్టవిరుద్ధ హింసాత్మక కార్యకలాపాల్లోనూ ఈ గ్యాంగ్ పాల్గొంటూ వస్తోంది. కాల్ సెంటర్ల ద్వారా ఫేక్ ఆఫర్లు ఇస్తూ.. అమెరికన్లు, కెనడియన్ల దగ్గరి నుంచి డబ్బులు కొట్టేస్తోంది.

అయితే, ఉద్యోగులను చంపడానికి కారణం ఏంటనేది ఇంకా తెలియలేదని జల్సికో పోలీసులు తెలిపారు. అయితే, వీరంతా తమ ఉద్యోగాలను వదిలేసేందుకు ప్రయత్నించారని, అందుకే దుండగులు హత్య చేసి ఉంటారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇతర ఉద్యోగులను కూడా భయపెట్టొచ్చని భావించి ఉండొచ్చని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మందిలో ఆరుగురి వయసు 30 లోపే ఉందని అధికారులు వెల్లడించారు.

చావడమే మార్గం!
అమెరికాలో ఇంగ్లిష్ నేర్చుకొని మెక్సికోకు తిరిగి వచ్చిన యువత ఎక్కువగా కాల్​ సెంటర్లలోనే పని చేస్తుంటారు. వీరికి డ్రగ్ ముఠాలు వల వేసి తమ కాల్​ సెంటర్లలో పని చేయించుకుంటున్నాయి. అయితే, ఎవరైనా ఉద్యోగులు తమపై తిరుగుబాటు చేస్తే అతి దారుణంగా చంపేయడం జల్సికో ముఠాకు అలవాటేనని తెలిసినవారు చెబుతున్నారు. తెలిసో, తెలియకో ఈ ముఠాలో చేరినవారు బయటకు వెళ్లాలంటే.. చనిపోవడం, జైలుకెళ్లడం తప్ప ఇంకో మార్గం లేదని అంటున్నారు. ఒక్క జల్సికో రాష్ట్రంలోనే 15 వేల మందికి పైగా ఇప్పటివరకు ఆచూకీ లేకుండా పోయారని బాధిత కుటుంబాల తరఫున పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ 'పొర్ అమోర్ ఎ ఎల్​క్స్' తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.