ETV Bharat / entertainment

సీనియర్ నటి జమున కన్నుమూత

author img

By

Published : Jan 27, 2023, 8:58 AM IST

Updated : Jan 27, 2023, 9:52 AM IST

telugu senior actress jamuna passed away
సీనియర్ నటి జమున కన్నుమూత

08:54 January 27

సీనియర్ నటి జమున కన్నుమూత

అలనాటి సినీ తార జమున (86) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జగ్గయ్య, ఎస్వీ రంగరావు సహా పలువురు నటులతో జమున నటించారు. 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారని తెలిసింది.

జమున 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు. ఈమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. జమున అసలు పేరు జనాభాయి. అయితే జోతిష్యుల సూచన మేరకు జమునగా మార్చారు. ఆమె తల్లి దగ్గరే శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలో శిక్షణ తీసుకున్నారు. అయితే సినీనటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడం వల్ల జమున కుటుంబానికి కొంత పరిచయం ఉండేది. ఆ సమయంలోనే నాటకాలకు ఆకర్షితురాలైన జమున చూసి తన నాటకాలలో అవకాశం ఇచ్చారు జగ్గయ్య. అలా ఆమె తొలిసారి ఖిల్జీరాజుపతనం చేశారు. ఆ తర్వాత జమున నటించిన 'మా భూమి' నాటకం చూసి డాక్టర్‌ గరికిపాటి రాజారావు ఆమెకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన 'పుట్టిల్లు' సినిమా కోసం పనిచేశారు. సత్యభామ పాత్రతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున.

చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటం వల్ల సినిమాల్లో మరింత బాగా రాణించారు జమున. తర్వాత అంచలంచెలుగా ఎదిగి దాదాపు 198 సినిమాల్లో నటించారు. దక్షిణాది భాషలన్నంటితో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ మెరిశారు. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావళి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలు బొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, లేత మనసులు, చదరంగం వంటి హిట్​ చిత్రాలతో మెప్పించారు జమున. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 2008లో ఎన్టీఆర్​ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు.

ఇక జమున వ్యక్తిగత విషయానికొస్తే.. 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారాయ. ఈ జంటకు ఇద్దరు సంతానం. కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి.

ఇదీ చూడండి: అందం.. అభినయం.. సాహసం.. కలిస్తే జమున.. తెలుగింటి 'సత్యభామ'

Last Updated :Jan 27, 2023, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.