ETV Bharat / business

ఇక వర్చువల్​ రియాలిటీలో పాఠాలు.. బడ్జెట్​లో చదువుకు పెద్దపీట! జీడీపీలో 6శాతానికి నిధులు!!

author img

By

Published : Jan 26, 2023, 3:09 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థల్లో ఒకటైన భారత్‌ 2047 కల్లా ప్రపంచశ్రామిక శక్తిలో 25శాతం వాటా చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఇందుకు నూతన విద్యావిధానం దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. అయితే బడ్జెట్‌ పరమైన మద్దతులేకుండా నూతన విద్యావిధానం లక్ష్యాలను అందుకోలేమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యకు, ఉపాధికి దేశంలో ఉన్న అంతరం తగ్గించేందుకు 2023 బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రానికి సూచిస్తున్నారు.

UNION BUDGET 2023
UNION BUDGET 2023

కేంద్రం ప్రవేశపెట్టనున్న నూతన బడ్జెట్‌లో కీలకమైన విద్యారంగంపై ఆసక్తి నెలకొంది. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన మోదీ సర్కార్‌... అందులో విధివిధానాల మేరకు కేటాయింపులు గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలను నిపుణులైన బోధనా సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కింద కొన్ని నూతన విధానాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఐదేళ్ల పరిమితకాలానికి విదేశీ విద్యా నిపుణులను భారత్‌కు రప్పించి దేశంలో బోధనా సిబ్బందికి శిక్షణ ఇప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇందుకోసం ఫారిన్ ఫ్యాకల్టీ హైరింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ నిధితోనే విదేశీ బోధనా నిపుణులకు జీతాలు, వసతి, ప్రయాణ ఖర్చును భరించేలా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలా దేశానికి తొలుత వచ్చే విదేశీ విద్యా నిపుణులకు పన్ను రాయితీలను కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

వీఆర్, ఏఆర్​ల ఉపయోగంపై శిక్షణ
యువత సంఖ్య పరంగా ప్రపంచానికి అత్యంత వేగంగా ప్రతిభావంతులను అందించే కేంద్రంగా భారత్ మారుతోంది. 2047 నాటికి ప్రపంచ శ్రామికశక్తిలో 25శాతం భారత్‌ నుంచే ఉండాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా భారతీయ విద్యార్థులను తీర్చిదిద్దాలని భావిస్తోంది. అయితే.. విద్యకు, ఉపాధికి మధ్య దేశంలో అంతరం బాగా ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యా సంస్థల్లో అందడంలేదంటున్నారు. ఈ అంతరాన్ని బాగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పరమైన మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. దేశంలో బోధనా సిబ్బందికి వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్‌మెంటెడ్ రియాల్టీ(ఏఆర్) ఉపయోగించేలా తగిన శిక్షణ ఇప్పిస్తే ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా తరగతి గదుల్లో సాంకేతిక వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు. ఇందుకు కేంద్రం బడ్జెట్‌లో చొరవ చూపాలని కోరుతున్నారు.

భవిష్యత్‌లో అభివృద్ధి చెందే సాంకేతికతలకు అనుగుణంగా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే నూతన సాంకేతికతలను మన విద్యార్థులు ఒడిసిపట్టేలా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్‌ సవాళ్లను అధిగమించేలా దేశవిద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలకు విద్య, సాంకేతికతను అందించేందుకు ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు. దేశంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం 2023 కేంద్ర బడ్జెట్‌ మరింత ఊతమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ విద్యాసంస్థలు, భారతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల మధ్య ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్స్‌ను విస్తృతం చేస్తే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలపై భారత విద్యార్థులకు కూడా అవగాహన కలుగుతుందనేది నిపుణుల మాట.

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థల్లో భారత్‌ ఒకటి. దాదాపు ఏడు కోట్ల మంది దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఆ మేరకు వారికి సౌకర్యాలను కూడా మెరుగు పరచాలనేది నిపుణుల వాదన. ప్రస్తుతం విద్యకు చేస్తున్న కేటాయింపులు జీడీపీలో దాదాపు మూడు శాతం వరకూ ఉన్నాయి. కానీ 6శాతం పెట్టుబడులు విద్యకు పెట్టాలని నూతన విద్యావిధాన లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. కాబట్టి 2023 బడ్జెట్‌లో కేంద్రం విద్యారంగానికి కేటాయింపులు పెంచుతుందని భావిస్తున్నారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఎడ్‌టెక్ రంగం కల్పించే సౌకర్యాలకు 2023 బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు ఇస్తే మేలు జరుగుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.