ETV Bharat / bharat

Janasena Pawan: వాలంటీర్లకు షాక్​.. పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదును వాపసు చేసిన న్యాయస్థానం

author img

By

Published : Jul 26, 2023, 9:49 AM IST

Court Returned the Complaint Against Pawan: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళా వాలంటీర్​ దాఖలు చేసిన పిటిషన్​పై విజయవాడ కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Case Return on janasena Chief Pawan
Case Return on janasena Chief Pawan

Court Returned the Defamation Case Against janasena Chief Pawan: వాలంటీర్లు, ఆ వ్యవస్థకు పరువు నష్టం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విజయవాడ న్యాయస్థానం వాపసు(రిటర్న్‌) చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసే భౌగోళిక విచారణాధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. అంతేకాక ఆ వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాదుదారురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయనేందుకు సరైన దస్త్రాలను సమర్పించాలంది.

వాలంటీర్ల ప్రతిష్ఠకు పరువునష్టం కలిగేలా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖలు చేశారని, ఐపీసీ సెక్షన్‌ 500(పరువునష్టం కలిగించినందుకు శిక్ష), 504, 505 తదితర సెక్షన్ల కింద శిక్షించాలని కోరుతూ శాంతినగర్‌కు చెందిన రంగవల్లి అనే మహిళా వాలంటీర్‌ విజయవాడ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌/ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో జులై 9వ తేదీన వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. తమను మానసికంగా ఆవేదనకు గురి చేశాయని, ఎటువంటి ఆధారాలు లేకుండానే వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: వారాహి విజయ యాత్ర రెండో విడతలో భాగంగా జులై 9వ తేదీన ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్​ వ్యవస్థపై పవన్​ తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో సుమారు 30 వేల మంది అదృశ్యమైతే.. అందులో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని జనసేన అధినేత పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని.. కేంద్ర నిఘా వర్గాలే తనను హెచ్చరించాయని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని.. సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అందుకు నిదర్శం.. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలలో 30 వేల మంది యువతులు అదృశ్యం కావడమేనని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించమనే అధికారం వాలంటీర్లకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వాలంటీర్లకు అధిపతి ఎవరని నిలదీశారు.

అయితే పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనమే సృష్టించాయి. వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. వాళ్లకి పోటాపోటీగా జనసేన నాయకులు కూడా నిరసనలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రమహిళా కమిషన్​ కూడా పవన్​కు నోటీసులు అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.