ETV Bharat / bharat

విద్యుత్తు అధికారులపై రైతు 'మిక్సీ' నిరసన.. ఆరు నెలలుగా ఆఫీసులోనే..!

author img

By

Published : May 30, 2022, 11:56 AM IST

Updated : May 30, 2022, 12:41 PM IST

విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సరికొత్త మార్గంలో నిరసన తెలిపారు ఓ రైతు. విద్యుత్తు కేంద్రంలోనే వంట సామగ్రిని మిక్సీ పట్టుకుంటున్నారు. ఇలా ఒక్క రోజు కాదు.. ఆరు నెలలుగా ప్రతిరోజు చేస్తున్నా అధికారుల్లో చలనం రావటం లేదు. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది.

Farmer brings mixer grinder to Mescom Office
విద్యుత్తు అధికారులపై రైతు 'మిక్సీ' నిరసన

కొత్తగా నిర్మించుకున్న ఇంటికి విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో తన ఇబ్బందులను తెలిపేందుకు ఓ రైతు ఏకంగా విద్యుత్తు కేంద్రానికే మిక్సీని తీసుకెళ్లి మసాలాలు పట్టుకుంటున్నాడు. ఇలా ఒక రోజు కాదు.. ఆరు నెలలుగా ఇలాగే చేస్తున్నా అధికారులు స్పందించటం లేదు. ఈ సంఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది. మెస్కామ్​(మంగళూర్​ విద్యుత్తు సరఫరా కంపెనీ లిమిటెడ్​) అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు భద్రావతి తాలూకాలోని మంగూట్​​ గ్రామానికి చెందిన రైతు హనుమంతప్ప.

ఇదీ జరిగింది: మంగూట్​ గ్రామంలో హనుమంతప్ప కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వాలని అనావేరిలోని మెస్కామ్​ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అధికారులు పట్టించుకోలేదు. విద్యుత్తు కనెక్షన్​కు డబ్బులు సైతం డిమాండ్​ చేశారు. దానికి హనుమంతప్ప ఒప్పకోకపోవటం వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. వ్యవసాయ మోటార్ల కనెక్షన్(ఐపీ)​ కాకుండా గృహ వినియోగదారుల కనెక్షన్​ ఇవ్వాలని కోరినప్పటికీ.. ఏ ఒక్కరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతు.

Farmer brings mixer grinder to Mescom Office
విద్యుత్తు కేంద్రంలో రైతు

ఇంట్లో వంట చేసేందుకు ఇబ్బందిగా ఉందని అధికారులకు తెలపగా.. తమ కార్యాలయానికి వచ్చి వంటకు కావాల్సిన మసాలలు, ఇతర సామగ్రిని గ్రైండింగ్​ చేసుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో ప్రతి రోజు మిక్సీతో మెస్కామ్​ ఆఫీసుకు వెళ్లి గ్రైండింగ్​ చేసుకుని వస్తున్నారు. హనుమంతప్పకు తల్లి, ఓ సోదరి, భార్యాపిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం వారి ఇంటికి సాధారణ విద్యుత్తు కనెక్షన్​ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామానికి 24/7 నిరంతర జ్యోతి పథకం కింద కొత్త కనెక్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో హనుమంతప్ప ఇంటికి ఉన్న విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. కొత్త కనెక్షన్​ ఇవ్వలేదు.

Farmer brings mixer grinder to Mescom Office
విద్యుత్తు కేంద్రంలో రైతు హనుమంతప్ప

"స్థానిక ఎమ్మెల్యే అశోక నాయక్​ ఇచ్చిన సిఫార్సు లేఖ చూపించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వారి సూచన మేరకే మెస్కామ్​ కార్యాలయానికి వచ్చి మసాలలను గ్రైండింగ్​ చేసుకుంటున్నా. మా ఇంటి నుంచి అర కిలోమీటర్​ దూరం ఉంటుంది. మాకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరిస్తే సమస్య తొలగిపోతుంది. "

- హనుమంతప్ప, రైతు

అధికారులు ఏమన్నారంటే?: హనుమంతప్ప విద్యుత్తు సమస్యపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు అనావేరి మెస్కామ్​ జేఈ విశ్వనాథ్​.' హనుమంతప్ప సమస్య మా దృష్టికి వచ్చింది. గతంలో వారికి ఐపీ ద్వారా పవర్​ కనెక్షన్​ ఇచ్చాం. నిరంతర జ్యోతి ప్రారంభించాకే సమస్య మొదలైంది. కొత్త లైన్​ వేసేందుకు అనుమతులు తీసుకున్నాం. త్వరలోనే పని పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. ఐపీ సెట్​ ద్వారా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉంటుంది. రాత్రి వేళల్లోనే సమస్య. ఆయన అనావేరి కార్యాలయానికి రాకుండా.. మల్లాపుర్​కు వెళ్లినట్లు తెలిసింది. మా పరిధిలోని ఏ ఒక్కరిని వదిలేసేది లేదు. సాధ్యమైనంత త్వరగా పవర్​ సప్లై చేస్తాం.' అని తెలిపారు.

ఇదీ చూడండి: ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?

Last Updated :May 30, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.