ETV Bharat / bharat

జాతీయ చిహ్నం వివాదం... వారు చెప్పినట్టే చేశానన్న శిల్పి!

author img

By

Published : Jul 13, 2022, 9:51 AM IST

National emblem controversy: సారనాథ్​లోని అశోక స్తంభం, పార్లమెంటు కొత్త భవనంపైన ఏర్పాటు చేసిన​ జాతీయ చిహ్నం రూపురేఖలలో చాలా తేడాలు ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్మాణ రూపశిల్పి స్పందించారు. జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.

జాతీయ చిహ్నం
జాతీయ చిహ్నం

National emblem controversy: జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్‌ వ్యాస్‌. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇవ్వగా.. దానికి అనుగుణంగానే జైపుర్‌లో తాము కాంస్య విగ్రహం తయారుచేశామని తెలిపారు. ఈ మేరకు ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటాలియన్ మైనపు పద్ధతిలో చిహ్నాన్ని డిజైన్ చేశామని.. అందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని స్పష్టం చేశారు.

ఈటీవీ భారత్​తో శిల్పి

పార్లమెంటు నూతన భవనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించిన జాతీయ చిహ్నం రూపురేఖలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో లక్ష్మణ్​ వ్యాస్​ స్పందించారు. సారనాథ్‌లోని అశోక స్తంభంతో తాజా నిర్మాణానికి చాలా తేడాలున్నాయంటూ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలవారు మండిపడ్డారు. ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. నూతన నిర్మాణంలో అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. సారనాథ్‌ స్తూపంలోని సింహాలు ఆకర్షణీయంగా, గంభీర వదనాన్ని కలిగి ఉండగా.. మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని మృగరాజులు రౌద్రంగా కోరలు చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని వారు ఆక్షేపించారు.

అశోక స్తంభంలోని సింహాల రూపాలు, గుణగణాలను మార్చడమంటే జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. నూతన పార్లమెంటుపై నిర్మాణాన్ని చూస్తే.. 'సత్యమేవ జయతే' నుంచి 'సింహమేవ జయతే'లా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయని తృణమూల్‌ నేత మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రం సంధించారు. 'గాంధీ నుంచి గాడ్సే వరకు' అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ వ్యవహారంపై ట్వీట్‌ చేశారు.

విపక్షాల విమర్శలను భాజపా ఖండించింది. సారనాథ్‌ స్తూపం తరహాలోనే పార్లమెంటుపై జాతీయ చిహ్నం ఉందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సారనాథ్‌ స్తూపం, ప్రస్తుత నిర్మాణం కొలతల్లో చాలా తేడా ఉందని.. అందుకే సింహాల రూపురేఖలు మారినట్లు కొందరికి అనిపిస్తుండొచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు. ఒకవేళ సారనాథ్‌ చిహ్నం పరిమాణాన్ని పెంచినా, పార్లమెంటు భవనంపై ఏర్పాటుచేసిన చిహ్నాన్ని దాని స్థాయికి తగ్గించినా రెండింటిలో తేడా ఏమీ కనిపించదని స్పష్టం చేశారు. విగ్రహ రూపురేఖల్లో కొంత తేడాలున్నంత మాత్రాన జాతీయ చిహ్నాన్ని అవమానించినట్లు కాదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సారనాథ్‌లోని స్తూపంతో పోలిస్తే కొత్త విగ్రహం చాలా రెట్లు పెద్దదని గుర్తుచేశారు. అందువల్లే రూపురేఖల్లో మార్పులు కనిపిస్తుండొచ్చని వ్యాఖ్యానించారు.

మరోవైపు- పార్లమెంటుపై జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడంపై విపక్షాలు గుప్పించిన విమర్శలను కొందరు నిపుణులు తోసిపుచ్చారు. పార్లమెంటు భవనంలో విగ్రహాలు, చిత్రపటాలను ప్రధాని ఆవిష్కరించడం ఇదే తొలిసారేమీ కాదని, జవహర్‌లాల్‌ నెహ్రూ కాలం నుంచి ఈ పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. 1956లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో బాలగంగాధర్‌ తిలక్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించారని గుర్తుచేశారు.

ఇదీ చూడండి : కోట్ల విలువైన హెరాయిన్​ సీజ్​.. మళ్లీ ముంద్రా పోర్ట్​ దగ్గరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.