ETV Bharat / bharat

పెళ్లికి నిరాకరించిందని యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన ప్రియుడు

author img

By

Published : Oct 7, 2022, 12:51 PM IST

Updated : Oct 7, 2022, 3:56 PM IST

అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మరోవైపు స్నేహితుడి మాటలు విని తన రెండేళ్ల కుమారుడిని హతమార్చిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat

తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. యువతి నిద్రిస్తున్న సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఝార్ఖండ్​.. దుమ్కా జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దుమ్కా జిల్లా బాల్కీ గ్రామానికి చెందిన ఓ యువతికి మహేశ్​పుర్​కు చెందిన రాజేశ్ అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటుండగా.. 2022లో రాజేశ్​కు మరొకరితో వివాహం జరిగింది. దీంతో యువతి తల్లిదండ్రులు సైతం ఆమెను మరొకరి ఇచ్చి పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ రాజేశ్​ మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడ్డాడు. యువతి ఎంత చెప్పినా వినకపోగా.. ఆమెను చంపుతానని బెదిరించాడు.

శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయం చూసుకుని రాజేశ్​ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు బద్దలకొట్టుకుని వెళ్లి అప్పటికే పడుకుని ఉన్న యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

స్నేహితుల మాటలు విని..
పెద్దయ్యాక తనకు హాని కలిగిస్తాడన్న స్నేహితుల చెప్పుడు మాటలు విన్న ఓ వ్యక్తి తన రెండున్నరేళ్ల కొడుకును కొట్టి హతమార్చాడు. ఆ వ్యక్తి బాలుడి తల్లికి రెండో భర్త గమానార్హం. ఇదంతా జరుగుతున్న సమయంలో చిన్నారి తల్లిని గదిలో బంధించిన నిందితుడు హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని ఇంట్లోని ఇనుప పెట్టెలో దాచాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనియార్​లో జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది : పోలీసుల వివరాల ప్రకారం కొత్వాలీకి చెందిన నిందితుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోగా రెండో భార్యను ఒకటిన్నర నెల క్రితం వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు కూడా ఇదివరకే పెళ్లవ్వగా ఆమె తన మొదటి భర్తను వదిలేసి నిందితుడితో కలిసుంటోంది. వీరందరూ ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు రెండున్నరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిందితుడు ఆ చిన్నారికి సవతి తండ్రి అవుతాడు.

పిల్లాడు పెరిగి పెద్దవాడై అతడ్ని చంపేస్తాడన్న స్నేహితుల మాటలు విన్న ఆ నిందితుడు.. కొడుకును కొట్టడం ప్రారంభించాడు. చిన్నారి తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఆమెను తీసుకెళ్లి ఓ గదిలో బంధించాడు. గదిలో నుంచి ఆ తల్లి ఎంత అరిచినా పట్టించుకోకుండా బిడ్డను చావబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం బయటపడకూడదని ఆ చిన్నారి మృతదేహాన్ని ఇంట్లో ఉన్న ఓ ఇనుప పెట్టెలో దాచాడు.

మరుసటి రోజు రాత్రి చిన్నారి మృతదేహాన్ని పారవేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతలోపే ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకున్నారు. ఇంతలో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లోని పెట్టెలోంచి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: కొట్టేసిన షాపులోనే 'పాల ప్యాకెట్లు' అమ్ముతూ దొరికిపోయిన దొంగ.. చితకబాదిన యజమానులు

సాధువులపై గ్రామస్థుల మూకదాడి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా అని భావించి..

Last Updated :Oct 7, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.