ETV Bharat / bharat

వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 7:09 AM IST

Andhra Pradesh State Debts Ten Lakh Crores: ఆంధ్రప్రదేశ్ అప్పెంత? రిజర్వ్‌ బ్యాంకే భయపడేంత! పారాహుషార్‌ అని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించేంత! స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తలుపులు మూసుకునేంత! స్టాక్‌ ఎక్సేంజ్ అప్రమత్తమై ట్రేడింగ్‌ నిలిపివేసేంత? ఇవన్నీ ఎందుకు అంకెల్లో చెప్పొచ్చు కదా అంటారా? అంకెల్లో చెప్తే గుడ్లు తేలేస్తారు! అమ్మో ఇంత రుణభారమా అని గుండెలు బాదుకుంటారు! కానీ జగన్ సర్కార్‌ మాత్రం రవ్వంతైనా ఆందోళన చెందడంలేదు! అప్పుల వేటలో అడ్డదారులు తొక్కుతూ రాష్ట్రాన్ని మరింత రుణఊబిలోకి నెట్టేస్తోంది.

andhra_pradesh_state_debts_ten_lakh_crores
andhra_pradesh_state_debts_ten_lakh_crores

Andhra Pradesh State Debts Ten Lakh Crores: వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు

Andhra Pradesh State Debts Ten Lakh Crores: పది లక్షల 11 వేల 827కోట్లు! ఇక్కడ కనిపిస్తున్న అక్షరాలు చదవడానికే కష్టంగా ఉంది కదా! కానీ మన జగనన్న ప్రభుత్వం పది లక్షల కోట్లకుపైగా అప్పును మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేసింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి మొత్తం అప్పు 10 లక్షల 21 వేల కోట్లకు చేరింది. గుత్తేదారులకు, సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు మరో లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని అనధికారిక అంచనా. ఆ పెండింగు బిల్లులూ ఓ రకంగా అప్పులాంటివే. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్‌ అని హెచ్చరిస్తున్నా, శ్రీలంకను చూసి నేర్చుకోండని సాక్షాత్తూ కేంద్ర మంత్రి దిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసినా వైఎస్సార్​సీపీ ప్రభుత్వం లెక్కచేయడంలేదు.

ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే! ఐతే, రాష్ట్ర GSDP (Gross State Domestic Product)లో 35 శాతం మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం.! కానీ ఏపీ అప్పులు జీఎస్​డీపీలో 42 శాతం దాటిపోయాయని కాగ్‌ హెచ్చరిస్తోంది. అనధికారిక అప్పులూ కలిపితే రుణాలు అది ఏకంగా 65 శాతం దాటిపోతున్న దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మన అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ సలహాదారులు, అధికారులు అప్పు ఎక్కడ ఎలా పుట్టించవచ్చో అన్వేషించి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే పనుల్లోనే నిమగ్నమై ఉంటున్నారు.

రికార్డు స్థాయిలో అప్పులు, రాబోయే ప్రభుత్వానికి చుక్కలు కనపడటం ఖాయం!

రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్త: ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు, సంస్థలు విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు, ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండని కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వు బ్యాంకు ద్వారా జాతీయ బ్యాంకుల్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన 18 వందల కోట్ల రూపాయల అప్పును స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, FRBM (Fiscal Responsibility and Budget Management) చట్టానికి విరుద్ధమని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శే స్పష్టంచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది. చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ ఆ కార్పొరేషన్‌ వాటికి హామీలు ఇచ్చింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. ఇదీ ఒక తరహా అప్పే. ఇలా చేయడం తప్పని రిజర్వు బ్యాంకు తప్పుపట్టింది. ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ 5 వేల కోట్ల రూపాయలను నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది. ముంబయి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ట్రేడింగుకు ప్రయత్నించింది. ఐతే ఆ ట్రేడింగులో ఎవరూ పాల్గొనవద్దని ముంబయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ సీనియర్‌ మేనేజర్‌ హెచ్చరించారంటే రాష్ట్ర దుస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అప్పులతో రోడ్డున పడుతున్న పరువు - ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్

అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు: రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌ రుణం, కేంద్రం నుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తాలు బయటికి కనిపించేవివే. కానీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తెచ్చే రుణాలు మూడోకంటికి తెలియవు. ఎఫ్​ఆర్​బీఎం పరిమితి దాటి అప్పులు తెస్తే రాష్ట్ర భవిష్యత్తేంటని ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి యాగీ చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు.

అప్పులు ఇచ్చేందుకు అంగీకరించని బ్యాంకర్లు: అంతకుముందు ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తి రెవెన్యూ రాబడిలో 90 శాతం వరకూ ప్రభుత్వం గ్యారంటీల మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది. జగన్‌ సర్కారు దాన్ని ఏకంగా 180 శాతానికి పెంచింది. ఈ రకంగా అనధికారిక అప్పులకు రెట్టింపు ఉత్సాహం ప్రదర్శించింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పేర్లతో మద్యం రాబడిని ఆ కార్పొరేషన్లకు మళ్లించింది! వాటిని ఆదాయంగా చూపించి అప్పులు పుట్టించింది. అలా ఆదాయం చూపినా ఏపీఎస్​డీసీకి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించలేదు. చివరకు విశాఖ నగరంలో విలువైన ప్రభుత్వ భూములను జగన్‌ సర్కారు బ్యాంకులకు తనఖా పెట్టేసింది.

Andhra Pradesh Top in Debts: ఐ డోంట్ కేర్ అంటున్న ఏపీ ప్రభుత్వం.. కాగ్‌ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ అప్పుల్లో టాప్

బిల్లులూ చెల్లించలేని పరిస్థితి: ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్న వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులు, సరఫరాదారులకు బిల్లుల చెల్లించకుండా బకాయిలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే జగన్‌ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 50 వేల కోట్ల రూపాయల మేర పెండింగులో ఉన్నాయి. గత 4 ఆర్థిక సంవత్సరాలుగా పెండింగు బిల్లులు ఏటా చెల్లించకుండా ల్యాప్స్‌ చేసేస్తున్నారు. ఆ తదుపరి బడ్జెట్‌లోకి వాటిని బదిలీ చేయడం లేదు. రాష్ట్ర బహిరంగ మార్కెట్‌ రుణాలు 3 లక్షల 76 వేల కోట్లు కాగా ఉదయ్ రుణాలు 8 వేల 256 కోట్లకు పెరిగాయి. ఇతర బాండ్లు రూపంలో 15 వందల కోట్లు అప్పు తెచ్చారు.

ఏది కావాలంటే దాన్ని తాకట్టుపెడుతూ: చిన్న మొత్తాల పొదుపుపై 6వేల 602 కోట్లు, నాబార్డు రుణాలు 9వేల 767కోట్లుగా ఉన్నాయి. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు 33 వేల 118 కోట్లకు చేరాయి. విద్యుత్తు సంస్థల నాన్‌ గ్యారంటీ రుణాలు 95 వేల కోట్లు, మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు, 50 వేల కోట్లు ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్‌ అప్పులు 50 వేల కోట్లకు, ఇతర కార్పొరేషన్ల రుణాలు లక్షా 45 వేల కోట్లకు చేరాయి. పెండింగు బిల్లులు లక్షా 70 వేల కోట్లుగా ఉన్నాయి. ఐనా ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు ఏది కావాలంటే దాన్ని తాకట్టుపెడుతూ మోయలేని భారాన్ని జగన్‌ ప్రజలపై రుద్దుతున్నాడనే విమర్శలున్నాయి.

YSRCP Government Continuously Runs with Debts: అప్పులు లేనిదే సాగని పాలన.. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రంపై రుణాల మోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.