KTR Slams Congress Govt Over Paddy Tenders Scam : సన్నబియ్యం టెండర్లలో మొత్తం రూ.1100 కోట్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి తెరలేపిందని మండిపడ్డారు. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, 700 నుంచి 750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ధాన్యం విక్రయం కోసం జనవరి 25న కమిటీ వేసి, టెండర్లు పిలిచారని, మొత్తం ప్రక్రియను ఒకేరోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
కుంభకోణంలో సీఎం రేవంత్ పాత్ర : ఇవాళ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం సేకరణ వ్యవహారంలో రూ. 300 కోట్ల స్కామ్ చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై 11 వందల కోట్ల రూపాయల కుంభకోణం చేశారన్నారు. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని, ఇందులో అనుమానం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న కుంభకోణంపై ఆధారాలతో సహా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోందని, ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తామని తెలిపారు.
నిబంధనలు మార్చేసి మిల్లర్లను బెదిరిస్తున్నారు : గ్లోబల్ టెండర్లు పిలిచి మొత్తం 4 సంస్థలకే కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. కేంద్రీయ భండార్ సంస్థను గత ప్రభుత్వం బ్లాక్ చేసిందని తెలిపారు. ఇప్పుడు నిబంధనలు మార్చేసి మళ్లీ కేంద్రీయ భండార్ సంస్థకే టెండర్ కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయాన్ని క్వింటాల్కు రూ.2007కే ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఒప్పందం చేసుకున్న దాని కంటే ఎక్కువ మొత్తం అనధికారికంగా చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు రూ.2,230 చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం 90 రోజుల్లో ధాన్యం మిల్లింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో ఉండే రైస్ మిలర్లు రూ.2100 ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దాన్ని రద్దు చేసి వారి మాట వినకుండా గ్లోబల్ టెండర్లు కింద ప్రత్యేక నిబంధనలు పెట్టి కుంభకోణానికి పాల్పడి 4 సంస్థలకే కట్టబెట్టారు'- కేటీఆర్, మాజీ మంత్రి
కాంగ్రెస్ మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపు : కేటీఆర్ - KTR Comments on CM Revanth Reddy