ETV Bharat / state

ఏపీపై ఓ కన్నేసి ఉంచండి - వేస‌విలో తాగునీటి సమస్య రావొద్దు : సీఎం రేవంత్‌ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 10:20 PM IST

Updated : Feb 23, 2024, 6:49 AM IST

CM Revanth Reddy Review on Drinking Water : రానున్న వేస‌విలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇతర అవసరాలకు నీరు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని అప్రమత్తం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏపీ నీటి తరలింపుపై సమగ్రంగా సమీక్షించి కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మంచినీటి సమస్య రాకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.

CM Meeting On Drinking water Issue
CM Revanth Reddy Review on Drinking Water

వేస‌విలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి

CM Revanth Reddy Review on Drinking Water : ఎండకాలంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ‌ర్షాభావంతో జ‌లాశ‌యాలు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్న నేప‌థ్యంలో ఎదుర‌య్యే స‌మ‌స్యలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదల, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగునీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించారు. రాష్ట్రంలోని ప్రతీ నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా వివిధ శాఖలు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్రణాళికలు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తాగునీటి కోసమంటూ నాగార్జునసాగ‌ర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీల‌కు పైగా నీటిని తరలిస్తోందని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివ‌రించారు. ఏపీలో అంత పెద్దమొత్తంలో తాగునీటిని ఎక్కడ వినియోగిస్తున్నారనే గణాంకాలు సేకరించి ఇతర అవసరాలకు నీటిని తీసుకోకుండా చూడాల‌ని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాగార్జునసాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి తాగునీరు తీసుకోవాలంటే కేఆర్ఎంబీకి లేఖ రాయాల్సి ఉంటుంద‌ని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏపీకి ఎంత నీరు అవ‌స‌ర‌మో స‌మ‌గ్రంగా స‌మీక్షించి వెంట‌నే కేఆర్ఎంబీకి (KRMB) లేఖ రాయాల‌ని అధికారులకు సీఎం సూచించారు.

విద్యుత్‌ కోతలు విధిస్తే సస్పెండ్‌ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth on Summer Drinking Water Supply in Telangana : ఏప్రిల్, మే నెల‌ల్లో వ‌ర్షాల‌తో జూరాల‌కు నీరు రావ‌డంతో ఇబ్బంది తలెత్తలేదని ఒకవేళ జలాలు రాకపోతే నారాయ‌ణ‌పూర్ జ‌లాశ‌యం నుంచి నీటి విడుదల కోసం కర్ణాటకను కోరాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. గ‌తంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా మూడేళ్ల క్రితం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అయితే చివ‌రి అవ‌కాశంగా మాత్రమే కర్ణాటకను కోరాలని తాగునీటి అవసరాల కోసం ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌ని రేవంత్‌రెడ్డి సూచించారు.

గతంలో వదిలేసిన అనేక నీటి వ‌న‌రుల‌ను వినియోగంలోకి తెచ్చే అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీరు వినియోగించుకునే అవ‌కాశం ఉంద‌ని, మిష‌న్ భ‌గీరథ వ‌చ్చిన త‌ర్వాత దానిని వ‌దిలేశార‌ని ఈ సందర్భంగా వివరించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన ఎస్‌డీపీ నిధుల్లో కోటి రూపాయలతో అవ‌స‌ర‌మైన చోట తాగునీటి బోర్లు, బావులు, మోటర్లకు మ‌ర‌మ్మతులు చేయించాల‌ని ముఖ్యమంత్రి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రా లేద‌ని తాను పర్యటనలో గమనించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలు ఈనెల 27 లేదా 29న ప్రారంభం

మిష‌న్ భ‌గీర‌థ (Mission Bhagiratha)ద్వారా 99 శాతం ఇళ్లకు నీళ్లిచ్చినట్లు గత ప్రభుత్వం కేంద్రానికి త‌ప్పుడు నివేదిక‌లు ఇచ్చినందునే జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రాలేద‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గొప్ప కోసం త‌ప్పుడు నివేదికలు ఇవ్వొద్దని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నివేదిక‌ల్లో వెల్లడించాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. జులై నెలాఖ‌రు వ‌ర‌కు ఎక్కడా తాగునీటి స‌మ‌స్య త‌లెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై క‌లెక్టర్లతో రెండు రోజుల్లో స‌మీక్ష నిర్వహించాలని సీఎస్ శాంతికుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందికి వేత‌నాల కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు రేవంత్‌రెడ్డి సూచించారు.

Revanth Meeting On Drinking water Issue : గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రేటర్‌కు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు లేవ‌ని అవసరమైతే ఎల్లంప‌ల్లి, నాగార్జునసాగ‌ర్ నుంచి తెప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని నీటి అవ‌స‌రాల‌పై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. వేసవి పూర్తయ్యే వరకు తాగు నీటి ట్యాంక‌ర్ల రాక‌పోక‌లకు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులకు రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు.

హైదరాబాద్​లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి : మంత్రి పొన్నం

'ఈసారి వరి వద్దు - ఆరుతడి పంటలే సాగు చేయండి'

Last Updated : Feb 23, 2024, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.