హైదరాబాద్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి : మంత్రి పొన్నం
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Feb 7, 2024, 6:40 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2024/640-480-20691125-thumbnail-16x9-minister-ponnam.jpg)
Minister Ponnam on GHMC Problems : హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జలమండలి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నీటి సరఫరా చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు తాగు, సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నాయని, తమ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో, నగరంలో తాగు నీటిపైనే ప్రధానంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు, అధికారులతో కలిసి హైదరాబాద్ నగర అభివృద్ధి, సమస్యలపై తొలిసారిగా సమీక్షించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శాఖల వారీగా పనితీరు, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ రోనాల్డ్ రాస్ సమగ్రంగా మంత్రికి వివరించారు. హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలని పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.