ETV Bharat / politics

99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP MANIFESTO 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 3:32 PM IST

YSRCP Fake Manifesto : మాట తప్పను. మడమ తిప్పను. చెప్పాడంటే, చేస్తాడంతే. ఈ రైమింగ్‌ డైలాగులు వినడానికి బాగున్నాయి కదా. ఇవి చెప్పుకునే జగన్‌ కాలం గడిపేస్తున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతానికి పైగా పూర్తిచేశానని జగన్‌ చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సీపీఎస్‌ రద్దు, పోలవరం, మద్య నిషేధం, ప్రత్యేకహోదా సాధన, మెగా డీఎస్సీతో సహా వైఎస్‌ ప్రారంభించిన జలయజ్ఞం పూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తికానివి ఎన్నో ఉన్నాయి. అయినా 99 శాతానికి పైగా హామీలు అమలు చేశానని ఎంత పచ్చిగా అవాస్తవాలు వల్లెవేశారో. జగన్‌ మాటలు వింటుంటే, ఈ మధ్యనే వచ్చిన 'అల వైకుంఠపురం' చిత్రంలో మనం చేయనివి కూడా చేసినట్లుగా ఇంత స్ట్రాంగ్‌గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్‌, ఒక వర్గానికి మీరు ఇన్‌స్పిరేషన్‌ అంతే అని కథానాయకుడు అల్లు అర్జున్‌ చెప్పే డైలాగ్‌ గుర్తుకొస్తోంది.

YSRCP Manifesto
YSRCP Fake Manifesto

99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి?

YSRCP Fake Manifesto : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ జగన్ విడుదల చేశారు. కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఉన్న పథకాలనే కొనసాగిస్తాం అభివృద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్​, ఖురానుతో సమానమన్న జగన్‌, 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా అమలు చేసేశారంట మరి. ఒకసారి సీఎం 2019లో ఇచ్చిన హామీలు, వాటి అమలును పరిశీలిద్దాం.

మద్య నిషేధం ఏమైంది?: 2019 మేనిఫెస్టోలో కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని జగన్​ తెలిపారు. 5 నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చేస్తామనీ గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యనిషేధం కాకుండా వారి హయాంలో మరిన్నీ బెల్టుషాప్​లను తీసుకొచ్చారు

ఐదేళ్లలో ‘జే బ్రాండ్ల ’ మద్యం విక్రయాల ద్వారా అధికారికంగా, అనధికారికంగా ప్రజల నుంచి రూ.1.54 కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుత మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే ఎత్తలేదు. అంత ముఖ్యమైన హామీపైనే నాలుక మడతేసిన మీరు, భగతవద్గీత, బైబిల్, ఖురాన్‌ అని చెప్పే మేనిఫెస్టోకి జగన్ అస్సలు ఏం విలువ ఇచ్చినట్టు? 99 శాతం మార్కులు ఎలా వేసుకుంటారు? ఇది రాష్ట్ర ప్రజల్ని వంచించడం కాదా? అనే అంశాలను ప్రజలు ఆలోచించాలి.

ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - AP CM jagan neglected ongole dairy

పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి?: వైఎస్సార్‌ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం, పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులూ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని 2019 మేనిఫెస్టోలో ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి రాగానే, మీ అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తునే అగమ్యగోచరంలోకి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో 72 శాతం పూర్తైన ప్రాజెక్టు పనుల్ని, ఈ అయిదేళ్లలో మరో అయిదారు శాతం మాత్రమే చేశారు. పైగా ఈ మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టును వచ్చే అయిదేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు కానీ, ఎప్పటికి అనే నిర్దేశిత సమయమంటూ చెప్పలేదు. గత అయిదేళ్లలో చేసింది అయిదారు శాతం పనులేనని మాత్రం చెప్పలేదు.

రాష్ట్రంలో జలయజ్ఞం కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, జగన్​ పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం కొత్తగా తీసుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి రూ.1.67 కోట్లు నిధులు కావాలని వారే లెక్కలు వేశారు. కానీ ఉద్యోగుల జీతాలు కూడా కలిపి గత అయిదేళ్లలో మీరు చేసింది మాత్రం రూ.35.2 కోట్లు మాత్రమే కదా? ఈ అయిదేళ్లలో మీరు సాధించిందేంటి? 2019 నాటికే 70 శాతం పనులు జరిగిపోయిన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడమా? వెలిగొండ రెండో టన్నెల్‌ పూర్తి చేసి ఏకంగా ప్రాజెక్ట్‌ నిర్మాణమే పూర్తయినట్లు హడావుడి చేయడం తప్పితే వైఎస్సార్​ ప్రభుత్వం ఏర్పడ్డాకా జగన్​ చేసింది ఏముంది.

ప్రత్యేక హోదా విషయంలోనూ : ఇక ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇంతే. పీఠం ఎక్కగానే తొలి దిల్లీ పర్యటనలోనే కాడి కింద పడేశారు కదా జగన్‌. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు. పార్లమెంటులో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే క్రమంలో కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి జగన్‌ బేషరతుగా మద్దతిచ్చారే తప్ప, ఎప్పుడూ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తేలేదు.

ఉద్యోగుల్ని ముప్పుతిప్పలు పెట్టారు: సీపీఎస్‌ రద్దుపై హామీ ఇచ్చి జగన్, అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. ఉద్యోగుల్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఎలక్షన్ సమయంలో అవగాహన లేక ఆ హామీ ఇచ్చామంటూ సీపీఎస్‌ రద్దుపై మాట మార్చారు. జీపీఎస్‌ పేరుతో మరో విధానం తెరపైకి తెచ్చారు. దీన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించినా, మొండిగా చట్టం చేశారు.

నిరుద్యోగులను నిలువునా ముంచారు: మెగా డీఎస్సీ అన్న జగన్‌. అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఎన్నికల దృష్టిలో యువతను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఇటీవల 6 వేల 100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ కూడా వాయిదా పడింది. పైగా క్రమం తప్పకుండా గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు ప్రకటించి, నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ ఈ మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల్ని మరోసారి వంచించేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. 18 విశ్వవిద్యాలయాల్లో కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న 3 వేల 295 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని మరో మోసపు హామీ ఇచ్చారు. ఔట్​సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూడా అటకెక్కించారు. ఆప్కాస్‌ ఏర్పాటుతోనే పనైపోయినట్లు జగన్‌ చేతులు దులిపేసుకున్నారు.

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలు మాత్రమే - AP CM JAGAN ASSETS

పరిశ్రమలు ఎక్కడ?: 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహమిచ్చామని, చెప్పకపోయినా, ఎంఎస్‌ఎంఈలకు రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్లు. ఈ 5 ఏళ్లలో రూ.85,543 కోట్ల పెట్టుబడులు వచ్చాయని జగన్‌ గొప్పలు చెప్పారు. వాస్తవం చూస్తే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్ష పేరుతో వారిపై వేధింపులకు పాల్పడింది. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూముల్ని వెనక్కు తీసుకుంది. వీళ్ల తీరు చూసి రిలయన్స్‌ సంస్థ రూ.15 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకుంది. విశాఖ నుంచి లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటి సంస్థల్ని ప్రభుత్వం తరిమేసింది. అమరరాజ బ్యాటరీస్‌ కంపెనీని రాజకీయ కక్షతో వేధింపులకు గురిచేయడంతో, ఆ కంపెనీ తమ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రానికి తరలించింది. మొత్తం మీద రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఏపీ నుంచి తరలిపోయాయి.

సంక్షేమంలో కోతలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం పేరుతో ఒక పేజీ నింపేశారు. అందులో కొత్త పథకం ఒక్కటీ లేదు. అదనపు ప్రయోజనాలూ లేవు. ఐదేళ్లలో ఎత్తేసిన పథకాల ప్రస్తావన లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని వివిధ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లయితే ఏర్పాటు చేశారుగానీ, ప్రత్యేకంగా నిధులు, విధులు కేటాయించలేదు. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేస్తున్నట్టు చూపించారు. స్వయం ఉపాధి రాయితీ రుణాల్ని ఎత్తేశారు. కేవలం వైఎస్సార్సీపీ నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు, రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లను మార్చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్లకు అర్హులను గుర్తించేందుకు ఎక్కడా లేని నిబంధనలూ పెట్టారు. ఆరంచెల వెరిఫికేషన్‌ పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టారు. అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లపాటు పెళ్లికానుక అమలు చేయలేదు.

ఇంకా మరెన్నో: అయిదేళ్లలో పేదలకు 25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌, 18.64 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు. వాటిలో 6.50 లక్షలే పూర్తి చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షల సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో 32.5 లక్షలు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు. రైతు భరోసా కింద రూ.50 వేలు ఇస్తామని 2019 మేనిఫెస్టో చెప్పినా, ఏటా రూ.13వేల 500 చొప్పున అయిదేళ్లలో రూ.67వేల 500 ఇచ్చామని జగన్‌ గొప్పలు చెప్పారు. పీఎం-కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలు కూడా కలిపి, రూ.13వేల 500 ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నికరంగా ఇస్తున్నది ఏటా రూ.7 వేల 500 మాత్రమే. కేంద్రం ఇస్తున్న దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ తన ఖాతాలోనే వేసేసుకుని అబద్ధాలు చెప్పడం అన్నదాతలను మోసం చేయడం కాదా?

అయిదేళ్ల పాలనలో అమ్మఒడి నాలుగేళ్లే ఇచ్చారు. ఒక ఏడాది కోత పెట్టారు. రూ.15 వేలు ఇస్తానని చెప్పి, పాఠశాల నిర్వహణ, మరుగుదొడ్ల పేరుతో 2 వేలు మినహాయించి, రూ.13 వేలే ఇచ్చారు. ప్రస్తుత హామీ పత్రంలోనూ మరో మోసానికి తెరలేపారు. బడి పిల్లల అమ్మలనూ అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేశారు. అమ్మఒడి కింద 17 వేల రూపాయలకు పెంచి కొనసాగిస్తామని చెప్పినా, ఇందులో వారికి దక్కేది రూ.15 వేలు మాత్రమే. మిగిలిన 2 వేలు పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు కోత పెడతారు. అమ్మఒడి కింద 15 వేలు ఇస్తామని గతంలో ప్రకటించిన పథకమే. ఇన్నాళ్లూ అందులో కోతపెట్టి రూ.13 వేల చొప్పున ఇచ్చారు.అవ్వాతాతల పింఛన్‌ను రూ.3 వేల 500 చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అదీ వచ్చే ఎన్నికలు సమీపించే సమయంలో, 2028, 2029 సంవత్సరాల్లో! అప్పటికి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని ప్రకటించారు.

చెప్పేదంతా అబద్ధమే: నాడు-నేడు కింద 8,534 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేస్తామని చెప్పగా, ఇప్పటికీ 50 శాతం పూర్తి కాలేదు. ప్రాంతీయ, సామాజిక హాస్పిటల్స్ భవన నిర్మాణ పనులూ 50 శాతం నిలిచిపోయాయి. 40 పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి. 3 వేల కోట్లతో ప్రతి బోధనాసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది.

17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని ప్రకటించగా, ఇప్పటి వరకు అయిదు మాత్రమే వచ్చాయి. సిద్ధం సభల్లో ఎక్కడ చూసినా 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని జగన్‌ చెబుతున్నారు. మేనిఫెస్టోలో మాత్రం వచ్చే అయిదేళ్లలో 5 వైద్య కళాశాలలు పూర్తి చేస్తామని, మిగిలిన 12 అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అంటే 17 కళాశాలలు తెచ్చామని చెప్పేదంతా అబద్ధమేనని అంగీకరించారు.

సొంత ఆటో, ట్యాక్సీ నడిపే వారు 7.5 లక్షల మంది ఉంటే, కేవలం 2.60 లక్షల మందికే రూ.10 వేల చొప్పున సాయం అందించారు. పైగా అయిదేళ్లలో భారీగా జరిమానాలు విధించారు. మత్స్యకార భరోసా లక్ష వరకు అంటూ దాన్నేదో రూ.20 వేలకు పెంచామన్నట్లుగా 2024 మేనిఫెస్టోలో ప్రకటించారు. వాస్తవానికి ఏటా రూ.10 వేల చొప్పున వేట నిషేధ సమయంలో ఇచ్చేదే.

గత అయిదేళ్లలో ఇచ్చిన సొమ్మును కూడా కలిపి పదేళ్లకు లక్ష అని లెక్కలేశారు. వైఎస్సార్ కాపునేస్తం పథకం కింద ఇకపై రూ.1.20 లక్షల వరకూ అని ప్రస్తుత మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇప్పటికే ఇచ్చిన రూ.60 వేలతో పాటు వచ్చే అయిదేళ్లలో మరో 4 విడతల్లో ఇవ్వబోతున్న రూ.60 వేలను కూడా కలిపి రూ.1.20 లక్షలుగా చూపారు. ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం కింద ఇచ్చే సాయంలోనూ ఇదే పరిస్థితి.

చెల్లి చీరపై అన్న​ సెటైర్లు - ​సంస్కారం ఉందా అంటూ జగన్​పై షర్మిల ఫైర్ - SHAMRILA COUNTER TO JAGAN COMMENTS

ఐదేళ్లుగా మాట్లాడకుండా వివేకాపై విద్వేషం ఎందుకు జగనన్నా? : సునీత - Sunitha on AP CM Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.