ETV Bharat / bharat

గ్యాంగ్​స్టర్​ టు పొలిటీషియన్- గుండెపోటుతో ముఖ్తార్ అన్సారీ కన్నుమూత - Mukhtar Ansari Passed Away

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 10:59 PM IST

Updated : Mar 29, 2024, 6:48 AM IST

Mukhtar Ansari Passed Away
Mukhtar Ansari Passed Away

Mukhtar Ansari Passed Away : ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​ స్టర్- రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గురువారం రాత్రి కన్నుమూశారు. బాందా జైలులో ఉన్న ముఖ్తార్‌కు గుండెపోటు రావడం వల్ల మెడికల్ కాలేజీకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.

Mukhtar Ansari Passed Away : ఉత్తర్‌ప్రదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 ఏళ్ల అన్సారీ గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అన్సారీ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం బాందా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్పత్రి ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా అన్సారీ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లో 144 సెక్షన్​ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసులు బలగాలతో పాటు రిజర్వ్​ దళాలను మోహరించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ క్రమంలో ఫిరోజాబాద్​లో పోలీసులు ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు.

'స్లో పాయిజన్ ఇచ్చారు'
జైలులో ముఖ్తార్​ అన్సారీకి స్లో పాయిజన్‌ ఇచ్చినట్లుగా ఆయన సోదరుడు, ఘాజీపుర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. అయితే ముఖ్తార్‌ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు.

ముఖ్తార్ అన్సారీపై 61 కేసులు
ఉత్తర్​ప్రదేశ్​లోని మౌ ప్రాంతానికి చెందిన ముఖ్తార్ అన్సారీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 మర్డర్ కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్‌ సభ్యుడిగా చేరారు అన్సారీ. ఆ తర్వాత 1990ల్లో తానే సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్‌, వారణాసి ప్రాంతాల్లో దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది అన్సారీ గ్యాంగ్. అయితే 2004లో అన్సారీ వద్ద మెషిన్‌ గన్‌ బయటపడడం వల్ల పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో 2005 నుంచి అన్సారీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఇక గ్యాంగ్​స్టర్​ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్​ అన్సారీ, ఐదుసార్లు మౌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో రెండు సార్లు బీఎస్​పీ తరఫున పోటీ చేసి గెలిచారు. అన్సారీ మృతికి ఆ పార్టీ ఎక్స్‌(ట్విటర్‌)లో సంతాపం ప్రకటించింది.

Last Updated :Mar 29, 2024, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.