తెలంగాణ

telangana

Munugode Bypoll Results : రేపే మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు

By

Published : Nov 5, 2022, 6:49 AM IST

Munugode Bypoll Results : రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారి.. ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉపఎన్నిక తుదిఘట్టానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఓ గోడౌన్‌లో స్ట్రాంగ్‌ ఏర్పాటు చేసిన ఈసీ ఆదివారం ఓట్లను లెక్కించనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్ట్రాంగ్‌రూం వద్ద ప్రత్యేక బలగాలతో మూడంచెలుగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

munugode bypoll
munugode bypoll

Munugode By poll Results : నెలరోజుల పాటు తీవ్ర ఉత్కంఠను రేపిన మునుగోడు ఉపఎన్నికలో విజేత ఎవరనేది ఆదివారం తేలిపోనుంది. మునుగోడు నియోజకవర్గంలో గురువారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ... 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో స్ట్రాంగ్‌ రూంను ఏర్పాటు చేశారు.

రేపే మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు

Munugode By Election Results : ఈ గోడౌన్స్‌లలోనే రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోలింగ్ ఏజెంట్‌లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా.. ఇవి పూర్తైన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.

మొత్తం 15 రౌండ్​లలో ఓట్ల లెక్కింపు:మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్​లలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కి కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్‌లను నియమిస్తున్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు విడుదల అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 15 రౌండ్‌లలో 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన అన్ని ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత:మొదటగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూర్ , మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్​లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణా రెడ్డి, ఆర్వో రోహిత్‌సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్‌లను నియమించుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. నెలరోజుల పాటు మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మోహరించిన గులాబీదళం.. తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది.

రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ:భాజపాలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్‌ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉపఎన్నికకు కారణమయ్యారు. వ్యక్తిగతంగా రాజగోపాల్‌తో పాటు భాజపాకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉపఎన్నికలో గెలుపు.. కమలదళానికి సైతం ముఖ్యంగా మారింది. వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు.. రేపు తేలనుండటంతో ఫలితాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

ఇవీ చదవండి:ప్రశాంతంగా ముగిసిన మునుగోడు ఓటింగ్.. 93.13 శాతం నమోదు

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. స్టే ఎత్తివేయాలని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

ఆస్పత్రిలో బ్రిటిష్ కాలం నాటి సొరంగ మార్గం.. ఎక్కడి వరకు ఉందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details