తెలంగాణ

telangana

కాసేపట్లో నల్గొండ జిల్లాకు కేసీఆర్.. థర్మల్ పవర్ ప్లాంట్​ను పరిశీలించనున్న సీఎం

By

Published : Nov 27, 2022, 5:47 PM IST

Updated : Nov 28, 2022, 10:27 AM IST

CM KCR Nalgonda Tour: నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించనున్నారు. 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉందని.. ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్ కోకు సూచించారు. ఇదే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి దామరచెర్లకు వెళ్తున్నారు.

CM KCR
CM KCR

CM KCR Nalgonda Tour: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లా దామరచర్ల వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచెర్లకు చేరుకుంటారు. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి.. సాయంత్రం హైదరాబాద్ కు ప్రయాణమవుతారు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు జెన్​కో అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ కూడా వచ్చే అవకాశం ఉండడంతో.. ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్ధంగా ఉంచారు. హెలీప్యాడ్ పనులను, ముఖ్యమంత్రి పరిశీలించనున్న ప్లాంటు పరిసరాలను మిర్యాలగూడ ఆర్డిఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావులు జెన్​కో అధికారులతో కలిసి పరిశీలించారు.

దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించనున్న నేపథ్యంలో అధికారుల హడావుడి నెలకొంది. ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండరును భెల్‌ సంస్థ దక్కించుకుంది. మొత్తం రూ.29,992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు ఉన్నాయి.

దీని నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్..వీటిలో మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరుకల్లా ప్రారంభిస్తామని జెన్‌కో తాజాగా వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండో ప్లాంటు, 2024లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం మొత్తం నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. ఒకటీ, రెండు ప్లాంట్లలో ఇంకా ఎక్కువ శాతం జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇది. దీని నిర్మాణాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని ప్రభుత్వ అంచనా. 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్‌కోకు సూచించారు.

భద్రత కట్టుదిట్టం..రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్‌ కేంద్రం కీలకమని, దీని నిర్మాణపనులను రాత్రింబవళ్లు పదివేల మంది కార్మికులు శరవేగంగా చేస్తున్నట్లు జెన్‌కో వర్గాలు తెలిపాయి. దీనికిచ్చిన పర్యావరణ అనుమతిని సమీక్షించి తిరిగి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిర్మాణానికి ఆటంకం కావని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణం ఆపాలని ఎన్జీటీ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు, ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 28, 2022, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details