ETV Bharat / bharat

'జీ20 అధ్యక్ష హోదాలో ప్రపంచ సంక్షేమం కోసమే కృషి'

author img

By

Published : Nov 27, 2022, 4:38 PM IST

MANN KI BAAT
MANN KI BAAT

శక్తిమంతమైన జీ-20 అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు భారత్‌ సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, పర్యావరణం వంటి సవాళ్లకు భారత్‌ వద్ద పరిష్కారం ఉందన్నారు. విక్రమ్-ఎస్‌ పేరుతో తొలిసారి ప్రైవేటురంగం ద్వారా అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపినట్లు చెప్పారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతకు భారత్‌ మారుపేరుగా నిలిచిందన్నారు. వివిధరంగాల్లో డ్రోన్ల వినియోగం కూడా పెరిగినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Modi Mann ki baat : జీ-20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష పగ్గాలు భారత్‌కు దక్కటం గొప్ప అవకాశమని, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చేనెల ఒకటిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేసియా నుంచి భారత్‌ అధికారికంగా చేపట్టనుంది. ఈ సందర్భంగా ప్రపంచ అవసరాలు, సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉందని ప్రధాని చెప్పారు. ప్రపంచశాంతి, ఐక్యత, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి వంటి విషయాల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు.

ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్‌లో భాగంగా ప్రధాని మోదీ వివిధ అంశాలను ప్రస్తావించారు. ప్రపంచమంతా ఒక కుటుంబం అనే ఇతివృత్తాన్ని తాము ఇచ్చినట్లు చెప్పారు. జీ-20కి సంబంధించి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు. జీ-20 లోగోను చేతితో తయారు చేసి పంపిన తెలంగాణ చేనేత కార్మికుడు హరిప్రసాద్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు.

"తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ ఉన్నారు. ఆయన తన చేతులతో జీ-20 లోగో తయారుచేసి పంపారు. ఈ అద్భుతమైన కానుక చూసి నేను ఆశ్చర్యపోయాను. వస్త్రాల తయారీలో ఉన్న నైపుణ్యం ద్వారా హరిప్రసాద్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. హరిప్రసాద్‌ చేతితో తయారుచేసిన జీ-20 లోగోతోపాటు ఓ లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించటం భారత్‌కు ఎంతో గౌరవప్రదమైన విషయమని పేర్కొన్నారు."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అంతరిక్ష రంగంలో కొత్త యుగం
రాకెట్‌ విక్రమ్-ఎస్‌ ప్రయోగంతో దేశంలోని ప్రైవేటు అంతరిక్ష రంగంలో కొత్త యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈనెల 18న స్వదేశీ అంకుర సంస్థ తయారు చేసిన ప్రైవేటు రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపినట్లు చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతకు భారత్ మారుపేరుగా మారినట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు.

"నవంబర్‌ 18న అంతరిక్ష రంగంలో భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఆ రోజు ప్రైవేటు రంగంలో తయారైన, డిజైన్‌ చేసిన రాకెట్‌ను భారత్‌ అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్‌ పేరు విక్రమ్-ఎస్‌. శ్రీహరికోట నుంచి స్వదేశీ అంతరిక్ష అంకుర సంస్థ ద్వారా ఈ రాకెట్‌ను పంపిన వెంటనే భారతీయులంతా గర్వంతో పొంగిపోయారు. విక్రమ్-ఎస్‌ రాకెట్‌ ఇతర దేశాల వాటితో పోల్చితే ఎంతో తేలికైనది, చౌకైనది. ఈ రాకెట్‌ అయిన వ్యయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ప్రమాణాలు, అంతరిక్ష సాంకేతికతకు భారత్‌ ఖ్యాతి గాంచింది. ఈ రాకెట్‌ తయారీ కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించారు. ఈ రాకెట్‌కు చెందిన కొన్నిభాగాలు 3-డీ ప్రింటింగ్‌ ద్వారా చేశారు."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

దేశంలో డ్రోన్ల వినియోగం కూడా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతమైన కినోర్‌లో డ్రోన్ల ద్వారా యాపిళ్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇండియన్‌ మ్యూజిక్‌ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరొచ్చిందని, భారతీయ సంగీత పరికరాలను అనేక దేశాల్లో విక్రయిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.