గత హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్... పంజాబ్లో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామంటే ఎలా నమ్మాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్విటర్ ద్వారా(Revanth tweet) ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల గుర్తింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు మృతి చెందారని తెలిపారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది చనిపోయారన్నారు. ఇంతవరకు వారి కుటుంబాలను ఆదుకోలేదని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇస్తామన్న వరద పరిహారం ఇవ్వలేదని... ఇలా ప్రజలకిచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకుంటామంటే ఎలా నమ్మేదని రేవంత్రెడ్డి ట్విటర్లో(Revanth Reddy on kcr) పేర్కొన్నారు.
రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం
సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్ శనివారం రోజు అభినందనలు (CM KCR on Three Farms Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... అమాయకులపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు. ఉద్యమ సమయంలో 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని తెలిపారు. అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని సీఎం డిమాండ్ చేశారు. మూడు డిమాండ్ల గురించి కేంద్రాన్ని అడుగుతాని తెలిపారు. కేంద్రానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషమని... విద్యుత్ చట్టాల విషయంలో కూడా కేంద్రం వెనక్కి తగ్గాలన్నారు. నూతన విద్యుత్ చట్టాలతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మాపై ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేశారు. ఇష్టమున్న రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాయని... విద్యుత్ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టం రద్దు చేసుకోకపోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:దేశ రాజకీయాలపై తెరాస ఫోకస్.. వ్యవసాయ సమస్యలే అస్త్రంగా దూకుడు..
CM KCR Delhi Tour: నేడు హస్తినకు సీఎం కేసీఆర్.. అన్ని విషయాలు తేల్చుకునేందుకే..