CM KCR Delhi Tour: నేడు హస్తినకు సీఎం కేసీఆర్​.. అన్ని విషయాలు తేల్చుకునేందుకే..

author img

By

Published : Nov 21, 2021, 5:26 AM IST

cm-kcr-going-to-delhi-for-clarity-on-paddy-procurement-from-modi-government

వరి కొనుగోళ్లు(paddy procurement in telangana), రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై స్పష్టత కోసం సీఎం కేసీఆర్ దిల్లీ బాట(CM KCR Delhi Tour) పట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందం దిల్లీకి వెళ్తోంది. కృష్ణా, గోదావరి జలాల వాటా(krishna godavari water dispute)పైనా స్పష్టత కోరతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వానా కాలం పంటలో ప్రతీ గింజను కొంటామని... రైతులు ఆందోళన పడవద్దని కేసీఆర్‌ భరోసా కల్పించారు.

వరి ధాన్యం కొనుగోళ్ల(paddy procurement in telangana)తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు తేల్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బృందాలు నేడు దిల్లీ(CM KCR Delhi Tour) వెళ్లనున్నాయి. సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందాలు దేశ రాజధానికి వెళ్లనున్నాయి. సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులను రాష్ట్ర మంత్రులు, అధికారులు కలవనున్నారు. తాను కూడా రెండు రోజుల పాటు దిల్లీలోనే ఉండి.. అవసరమైతే ప్రధానిని కలిసి(cm kcr meets modi) డిమాండ్ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. వరి ధాన్యం ఎంత కొంటారో వార్షిక లక్ష్యం చెబితే... రైతాంగం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం ప్రకటించినట్లు(central govt on paddy purchase) అనధికార వార్త వచ్చిందని.. అది నిజమో కాదో కూడా తెలుసుకుంటామన్నారు. అనురాధ కార్తె ప్రారంభమైనందున కేంద్రం త్వరగా తేల్చాల్సిన అవసరం ఉన్నందున.. నేడు దిల్లీ వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. దిల్లీ పర్యటనలో కేంద్రం స్పందనను బట్టి రాష్ట్రంలో యాసంగి పంటలపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

నీళ్ల వాటపై స్పష్టత కోసం..

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా తేల్చాలని కూడా డిమాండ్ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయడానికి అడ్డం ఏమిటని ప్రశ్నించారు. తమ వల్లే జాప్యమవుతోందని కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యానించడం... మరింత పరువు తీసుకోవడమేనని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొదట రాసిన లేఖ నదీ జలాల వాటా కోసమేనని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత కాల వ్యవధితో సెక్షన్ 3 ప్రకారం వాటాలు తేల్చాలని డిమాండ్ చేశారు.. తమ ఓపికకు హద్దు ఉంటుందని... ఇక ఉద్యమాలు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటి కేంద్రం తేల్చడం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రం తేల్చకపోతే గిరిజన పోరాటాలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చాలా కాలంగా ఉందని.. దానిపై కేంద్రం ఏదో ఒకటి తేలిస్తే.. ఏం చేయాలో నిర్ణయించుకుంటామన్నారు.

వానాకాలం పంట పూర్తిగా కొంటాం..

వానాకాలం పంటలో ప్రతీ గింజను కొంటామని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నందున... కోతల కోసం రెండు, మూడు రోజులు ఆగాలని.. ఇప్పటికే కోసిన వారు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కేసీఆర్ కోరారు. స్థానిక భాజపా నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని.. వరి సాగుపై తప్పుడు ప్రకటనలు చేసిన నాయకులు రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.