KTR On Convenience Deed Distribution Program : రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఐటీ మంత్రి కేటీఆర్ జోస్యం చేశారు. ఈసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్ హస్తినాపురం జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కన్వీనియన్స్ డీడ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలో 118 జీవో ద్వారా లబ్ధిదారులకు కన్వీనియన్స్ డీడ్ పత్రాలను మంత్రి అందజేశారు.
32 కాలనీలకు చెందిన 4000 మందికి ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లో లక్షరెండు పడక గదుల ఇళ్లుపంపిణికి సిద్ధంగా ఉన్నాయన్నారు. గృహ లక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉంటే రూ.3లక్షలు అందిస్తామని తెలిపారు. అలాగే తర్వలోనే ఎల్బీనగర్ - నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
మెుత్తం 314 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ 159 కి.మీ. మెట్రో రూట్ ఏర్పాటు చేస్తామన్నారు. భూసేకరణ, తక్కువ ఖర్చుతో ఇది ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. హస్నాపూర్ నుంచి పెద్దఅంబర్పేట్ వరకు మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. 'నాడు తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ బయలుదేరితే ఎవరూ నమ్మలేదు.. అలాగే ఇప్పుడు కూడా నమ్మడం లేదు.. కానీ చేసి చూపిస్తాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.