తెలంగాణ

telangana

Bandi Sanjay and MLC Kavitha Tweet War : బండి సంజయ్‌ VS ఎమ్మెల్సీ కవిత.. ట్విటర్‌లో మాటల యుద్ధం

By

Published : Jun 13, 2023, 7:38 PM IST

Tweet War Between Bandi Sanjay and MLC Kavitha : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలను ఉద్దేశించి బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ కవిత అంతే ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. దీనిపై బండి మరోసారి స్పందించడంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

Bandi Sanjay and MLC Kavitha Tweet War
Bandi Sanjay and MLC Kavitha Tweet War

Bandi Sanjay Tweet on Welfare Celebrations : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్విటర్‌ వేదికగా పలు విమర్శలు చేశారు. 'రాష్ట్ర గవర్నర్‌కు దక్కదు గౌరవం. ఆడ బిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్‌ అడ్డం. అదిరింది కేసీఆర్‌ నీ మహిళా సంక్షేమం' అంటూ బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

MLC Kavitha Tweet Today : బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు. ఆడబిడ్డలు తలుచుకున్నారని.. ఇక బీజేపీ అడ్రస్ గల్లంతేనంటూ ఆమె ట్వీట్‌ చేశారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదని.. మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నప్పటికీ తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవంటూ కవిత తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. భేటీ బచావో.. భేటీ పడావో నినాదాలకే పరిమితమైందని.. మహిళలకు విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్‌లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి నెలకొన్నదని.. ఆడబిడ్డల సంక్షేమం కన్నా కొందరి అభివృద్ధే బీజేపీకి ముఖ్యమైందని కవిత విమర్శించారు.

ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

  • పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం..
  • మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు..
  • నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... భేటీ పడావో..
  • సిలిండర్‌ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి..
  • మహిళా విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం..
  • ఆడ బిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం.
  • ఆడబిడ్డ తలచుకుంది.. ఇక మీ అడ్రస్‌ గల్లంతవుతుంది..

Welfare Celebrations in Telangana : కవిత కౌంటర్‌పై స్పందించిన బండి సంజయ్‌ మరోసారి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం వహిస్తారని.. ఆడబిడ్డలను వేధించి, పీడించి.. ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యమని ఆరోపించారు. పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకేళ్లు వేశారంటూ మండిపడ్డారు. పసి బిడ్డ నుంచి పండు ముసలి దాకా ఎవరికీ రక్షణ లేదన్న ఆయన.. తొలి కేబినెట్‌లో కనీసం ఒక్క మహిళకూ ప్రాతినిథ్యం దక్కలేదని విమర్శించారు. మరుగుదొడ్లు సైతం లేక ఎంతోమంది ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రాజకీయాల కోసం మహిళా బిల్లు అంటూ వీధులకెక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళా లోకం ఏనాడో పసిగట్టిందని.. గులాబీ పార్టీ పని పడుతుందని కవితకు కౌంటర్‌ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details