తెలంగాణ

telangana

మాస్, క్లాస్​.. సినిమా ఏదైనా నాగ్​ రూటే సపరేటు!

By

Published : Aug 29, 2021, 5:32 AM IST

మాస్‌ కథానాయకుడు అనే మాటకు అసలు సిసలు నిర్వచనం నాగార్జున (Akkineni Nagarjuna). 'శివ' అంటూ సైకిల్‌ చైన్‌ పట్టి యువతరాన్ని అలరించిన ఆయనే.. 'అల్లరి అల్లుడు'గా కుటుంబ కథల్లోనూ ఒదిగిపోయారు. 'మన్మథుడు'గా మగువల మనసునూ దోచారు. ఆ తర్వాత 'అన్నమయ్య' అంటూ భక్తిభావాన్నీ పండించారు. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున నేడు (ఆగస్టు 29) 62వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Nagarjuna Akkineni
Nagarjuna Akkineni

నాగార్జున..(Akkineni Nagarjuna) అక్కినేని నాగేశ్వరరావు 'వారసుడు'గా వచ్చినప్పటికీ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టించుకున్న టాలీవుడ్‌ 'కింగ్‌'. అభిమానుల మనస్సులు దోచుకోవడంలో నాగ్‌ ఓ 'కేడి'. ఇప్పటికీ తన లుక్స్‌తో 'సోగ్గాడే చిన్ని నాయనా' అనిపించుకుంటున్న 'మన్మథుడు'. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, రియాల్టీషో వ్యాఖ్యాతగా తన సత్తా చాటిన నాగ్‌ నేడు (ఆగస్టు 29) 62వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

నాగార్జున బర్త్​డే

బాల్యం..

తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా ఎన్టీఆర్‌-ఏఎన్​ఆర్​ను అభిమానులు అభివర్ణిస్తారు. అంతటి విఖ్యాతి గాంచిన ప్రముఖ నటుడు నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు తమిళనాడులోని చెన్నైలో జన్మించారు నాగార్జున. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రంలోనే నిర్మించాలనే ఉద్దేశ్యంతో అక్కినేని తొలిగా హైదరాబాద్‌కి తరలివచ్చారు. దాంతో.. నాగార్జున విద్యాబ్యాసం హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్, లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజ్‌లో నాగ్​ చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. మిచిగాన్‌ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీ.ఎస్‌. చేశారు.

తెరంగేట్రం ఇలా..

ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సుడిగుండాలు' సినిమాలో బాలనటుడిగా కనిపించారు నాగ్‌. అంతకు ముందు 'వెలుగు నీడలు' అనే సినిమాలో పసిపిల్లాడిగానే స్కీన్ర్‌పై మెరిశారు. ఈ రెండు సినిమాలలో హీరో అక్కినేని నాగేశ్వరరావు కావడం విశేషం. ఆ తర్వాత కొన్నేళ్లకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించిన 'విక్రమ్' సినిమాతో హీరోగా మారారు. హిందీలో వచ్చిన 'హీరో' సినిమాకు ఈ చిత్రం రీమేక్‌. ఈ సినిమా మంచి విజయమందుకొని నాగ్‌కి ఓ మంచి స్టార్ట్ ఇచ్చింది. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'మజ్ను' చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇలా 'ఆఖరి పోరాటం', 'జానకి రాముుడు'తో తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు నాగార్జున.

నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్​ డ్రామా 'గీతాంజలి'. ఈ చిత్రం తర్వాత 'శివ' రూపంలో మరొక విజయాన్ని కూడా అందుకున్నారు నాగ్. అప్పట్లో ఈ చిత్రం ట్రెండ్​ సెట్టర్​గా నిలిచింది. టాలీవుడ్​లో నాగ్​కు స్టార్​ హోదాను అందించింది.

సెల్యులాయిడ్‌ సైంటిస్ట్‌..

నాగార్జున కెరీర్‌లో 'కిల్లర్‌', 'నేటి సిద్దార్థ్', 'నిర్ణయం' సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలను అందుకోగలిగాయి. నాగార్జునను ప్రేమగా అప్పట్లో 'సెల్యులాయిడ్‌ సైంటిస్ట్‌' అని పిలిచేవారు. అంటే చలనచిత్ర శాస్త్రవేత్త అని అర్ధం. వివిధ స్క్రిప్టులతో ప్రయోగాలను చేస్తూ ఉండడం వల్ల నాగ్​ను అలా పిలిచేవారట. 'ప్రెసిడెంట్‌ గారి పెళ్ళాం', 'వారసుడు', 'ఘరానా బుల్లోడు', 'అల్లరి అల్లుడు' వంటి వరుస విజయాలతో నాగ్‌ కెరీర్‌ అప్పట్లో ఫుల్‌ జోష్‌ మీద ఉండేది.

కృష్ణవంశీ దర్శకత్వంలో, నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'నిన్నే పెళ్లాడుతా'. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్​ను నాగ్​ మరింత చేరువయ్యారు. ఆ తర్వాత 'అన్నమయ్య', 'నువ్వు వస్తావని', 'ఆజాద్​' వంటి విభిన్న కథలలో నటించారు. రొమాంటిక్​ కామెడీ చిత్రాలైన 'సంతోషం', 'మన్మథుడు', 'శివమణి' చిత్రాలతో అలరించారు. 'సూపర్​', 'డాన్', 'కింగ్​' చిత్రాలతో తనలోని విభిన్న నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు నాగ్​.

అక్కినేని కుటుంబానికి ప్రత్యేకం'మనం'..

అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన 'మనం' సినిమా బ్లాక్‌ బాస్టర్‌ ఫామిలీ డ్రామాగా నిలిచింది. డ్యుయల్‌ రోల్స్‌లో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్​లలో ఒకటిగా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊపిరి' సినిమాలో ఓ వికలాంగుడి పాత్రలో నాగ్‌ నటించారు. ఈ సినిమా హిట్టయింది. 'శ్రీరామదాసు' చిత్రం తర్వాత 'ఓం నమో వెంకటేశాయ'తో మళ్ళీ ఓ భక్తుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్‌. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు మాత్రం గెలుచుకోగలిగింది. నాగార్జున నటించిన 'రాజుగారి గది2' అనే హారర్‌ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్​గా నిలిచింది. ఆ తర్వాత రాంగోపాల్‌ వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఆఫీసర్‌' చిత్రం నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ అయింది. గతేడాది శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నానితో నాగార్జున నటించిన సినిమా 'దేవదాస్‌'. ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ని సొంతం చేసుకొంది. ఇక 'రా' బ్యాక్​డ్రాప్​లో ఈ ఏడాది విడుదలైన 'వైల్డ్​ డాగ్​' చిత్రం విభిన్న చిత్రంగా పేరొందింది.

బుల్లితెరపైనా..

వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరనూ నాగ్‌ ప్రభావితం చేశారు. 'యువ' అనే సీరియల్‌తో బుల్లితెరపై ఓ నిర్మాతగా అడుగుపెట్టారు నాగ్‌. మా టీవీని స్టార్‌ నెట్‌వర్క్‌కు విక్రయించే ముందు నాగార్జున ఆ ఛానల్‌కు ప్రధాన వాటాదారుడిగా ఉండేవారు. 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' తెలుగు వెర్షన్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు నాగార్జున హోస్ట్‌ చేశారు. ప్రస్తుతం 'బిగ్‌ బాస్‌' సీజన్‌ 4కు వ్యాఖ్యాతగా చేస్తూ బిజీగా ఉన్నారు.

పురస్కారాలు

  • 'నిన్నే పెళ్ళాడతా' చిత్రానికి 'బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ తెలుగు' కేటగిరీలో నిర్మాతగా, 'అన్నమయ్య' సినిమాకు స్పెషల్‌ మెన్షన్‌ - యాక్టర్‌ కేటగిరీకిగానూ జాతీయ చిత్ర పురస్కారాలను అందుకున్నారు నాగ్​.
  • ఉత్తమ నటుడిగా.. 'అన్నమయ్య', 'సంతోషం', 'శ్రీరామదాసు', 'రాజన్న' చిత్రాలకు నంది బహుమతిని అందుకున్నారు.
  • ఉత్తమ నిర్మాతగా.. 'నిన్నే పెళ్లాడతా', 'ప్రేమ కథ', 'యువకుడు', 'రాజన్న' సినిమాలుకు పలు అవార్డులను అందుకున్నారు. ఇలా మరెన్నో పురస్కారాలను అందుకున్నారు కింగ్​ నాగార్జున.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details