తెలంగాణ

telangana

'ట్విట్టర్​ను తీసేస్తామని యాపిల్ బెదిరిస్తోంది.. టిమ్​ కుక్.. ఏంటి కథ?'

By

Published : Nov 29, 2022, 10:34 AM IST

ప్రముఖ కంపెనీ యాపిల్​పై ట్విట్టర్​ సీఈఓ ఎలన్​ మస్క్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ స్టోర్‌ నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తామని యాపిల్‌ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ట్విట్టర్‌ను బ్లాక్ చేసేందుకు యాపిల్ అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తోందని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు.
Apple has 'threatened to withhold' Twitter
apple

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌పై ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు చేశారు. యాపిల్‌ స్టోర్‌ నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ట్విట్టర్‌ను బ్లాక్ చేసేందుకు యాపిల్ అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తోందని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఐఫోన్‌.. తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రకటనలను నిలిపివేసిందని తెలిపారు. కంటెంట్ మోడరేషన్ పేరుతో యాపిల్‌.. ట్విట్టర్‌పై ఒత్తిడి తెస్తోందని మస్క్ ఆరోపించారు.

అయితే, గాబ్​, పార్లర్​ వంటి యాప్‌లను యాపిల్‌ ఇంతకు ముందు తొలగించింది. యాప్‌ కంటెంట్‌ మోడరేషన్‌ను అప్‌డేట్‌ చేసిన అనంతరం 2021లో యాపిల్‌ పార్లర్‌ యాప్‌ను పునరుద్ధరించింది. అయితే, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ను ట్యాగ్‌ చేస్తూ ఎలాన్‌ మస్క్‌ పలు ప్రశ్నలు సంధించారు. 'అమెరికాలో ఫ్రీ స్పీచ్ ఉండడం ఆ సంస్థకు నచ్చదా? ఏం జరుగుతోంది టిమ్​ కుక్​?' అంటూ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకు దీనిపై యాపిల్‌ స్పందించలేదు.

అడ్వటైజ్‌ డేటాబేస్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ వివరాల ప్రకారం.. నవంబర్ 10 మరియు 16 మధ్య ట్విటర్ ప్రకటనల కోసం 1,31,600 డాలర్లను ఖర్చు చేసింది. ఇంతకు ముందు అక్టోబర్ 16 -అక్టోబర్ 22 మధ్య ఇది 2,20,800 డాలర్లుగా ఉండేది. మరోవైపు యాప్ స్టోర్ లావాదేవీల్లో యాపిల్‌కు 30శాతం ఫీజు చెల్లించాలని ఉన్న నిబంధనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై సైతం ఎలాన్‌ మస్క్‌ విమర్శలు గుప్పించారు. 'యాపిల్ యాప్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసే ప్రతిదానిపై రహస్యంగా 30 శాతం పన్ను విధిస్తుందని మీకు తెలుసా?' అంటూ ట్వీట్‌ చేశారు. మరి దీనిపై యాపిల్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details