తెలంగాణ

telangana

పార్లమెంట్ సమావేశాలకు సర్వం సిద్ధం- సభలో ఇక సమరమే!

By

Published : Nov 28, 2021, 5:36 PM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session 2021) వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైన వేళ.. సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెగసస్​, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లు వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఆయా పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

parliament winter session
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు (Parliament news) సర్వం సిద్ధమైంది. ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేలా విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడం... ఏం అంశంపైనైనా చర్చకు సిద్ధమేనని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సమావేశాలు అత్యంత వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.

సాగు చట్టాల రద్దు..

సోమవారం ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో అందరి చూపు సాగు చట్టాల రద్దుపైనే ఉండనుంది. మూడు వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ మేరకు బిల్లును (Farm laws repeal bill 2021) పార్లమెంట్​లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సమావేశాల తొలిరోజే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 'కొంతమంది' రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని.. అయినప్పటికీ అందరిని దృష్టిలో ఉంచుకొని రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం బిల్లులో పేర్కొంది. తొలిరోజు పార్లమెంట్​ సమావేశాలకు తప్పక హాజరు కావాలని భాజపా, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. విపక్ష పార్టీలన్నీ ఈ బిల్లుకు మద్దతు తెలపడం లాంఛనమే కానుంది!

ఎంఎస్​పీకి చట్టబద్ధతపై...

అయితే, రైతుల సమస్యలపై విపక్షాలు వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఎంఎస్​పీకి చట్టబద్ధత కల్పించే విషయమై.. మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో దాదాపు అన్ని పార్టీలూ దీనిపై మాట్లాడాయి. సమావేశాల్లో కనీస మద్దతు ధరపై చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశాయి. దీంతో పాటు సాగు చట్టాల ఉద్యమంలో అమరులైన రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

పెగసస్​ వ్యవహారం (Pegasus issue in parliament), ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లపై సభలో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై పార్లమెంట్​లో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.

కేంద్రం బిల్లుల అజెండా..

సాగు చట్టాల రద్దు బిల్లు కాకుండా మరో 25 ముసాయిదా చట్టాలను (Winter session of Parliament 2021 bills list) పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే బిల్లు సైతం ఈ భేటీలో ఉభయ సభల ముందుకు రానుంది. ఈ బిల్లుతో ఆర్​బీఐ తన అధికారిక డిజిటల్ కరెన్సీ రూపొందించే వీలు కలుగుతుంది.

  • వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు-2019పై సంయుక్త పార్లమెంట్ కమిటీ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లుతో పాటు కమిటీ ఇచ్చిన నివేదికపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. 2019లోనే దీన్ని పార్లమెంట్​లో ప్రవేశపెట్టగా.. విపక్షాల డిమాండ్​తో సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు.
  • నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్​స్టాన్సెస్ చట్ట సవరణ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సవరణ బిల్లు, దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్​మెంట్ సవరణ బిల్లు సైతం పార్లమెంట్ ముందుకు రానుంది. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడగించేందుకు పై రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇప్పటికే వీటిపై ఆర్డినెన్సులు జారీ చేసింది.
  • రాజకీయపరమైన బిల్లులు సైతం ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు (bills before parliament) రానున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ జాబితాను సవరించే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు బిల్లులు...

  • హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతన సవరణ బిల్లు 2021
  • దివాలా రెండో సవరణ బిల్లు
  • పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్​మెంట్ అథారిటీ సవరణ బిల్లు
  • 1983 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 2021 ఇమ్మిగ్రేషన్ బిల్లు
  • నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021
  • మనుషుల అక్రమ రవాణా నిరోధక, రక్షణ, పునరావాస బిల్లు 2021

చర్చకు సిద్ధమే.. సహకరించండి: కేంద్రం

సమావేశాల్లో స్పీకర్, ఛైర్మన్ అనుమతించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉభయ సభలు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలను కోరింది.

ఇదీ చదవండి:పెగసస్, నిరుద్యోగంపై చర్చకు విపక్షాల డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details