Heavy gold seizure at Shamshabad Airport : అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. శంషాబాద్ విమానాశ్రయానికి అక్రమ బంగారం రవాణా మాత్రం ఆగడం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో.. మరోసారి భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. విదేశీయులు వారి లోదుస్తుల్లో బంగారాన్ని దాచిపెట్టుకుని రవాణా చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించి వారి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కరోజులోనే మొత్తం ఆరుగురి ప్రయాణికులను వేరు వేరు సందర్భాల్లో పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు రూ.5.46కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు.
9 Kg Gold Seized by Custom Officers in Hyderabad : విమానంలో శంషాబాద్కు వచ్చిన ఆరుగురు వ్యక్తుల నుంచి 5కోట్ల 46లక్షల విలువైన 9కిలోల బంగారాన్ని పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బాంకాంక్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఒక కోటి 21లక్షల 34వేల రూపాయల విలువైన 2కిలోల బంగారు కడ్డీలు, అదే విమానంలో వచ్చిన మరోకరి నుంచి రూ.1,08,81, 165 విలువైన 1.78కిలోల బంగారపు కడ్డీలను పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.1,31,77,524 విలువైన 2.17కిలోల బంగారం, దుబాయ్ నుంచి మరో ప్రయాణికుడినుంచి రూ.1,24,31,283 విలువైన 2.05కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ గాంధీ దోంతి వివరించారు. మరో ఇద్దరు వ్యక్తులు విమానాశ్రయంలో అనుమానంగా తిరుగుతున్న షేక్ ఖాజా రెహమతుల్లా, షేక్ జానీ బాషలను అధికారులు పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా.. రూ.60లక్షలు విలువైన కిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించారు. నిందితులు డ్రై ఫ్రూట్లలో పుత్తడిని దాచి రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.