Gold seize in Shamshabad airport : శంషాబాద్ విమానాశ్రయంలో 3.7కిలోల బంగారం పట్టివేత.. లగేజీబ్యాగుల తనీఖీల్లో స్వాధీనం
Gold seize in Shamshabad airport : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.2.29 కోట్లు విలువైన 3743 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. జెడ్డా నుంచి ఇద్దరు, దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీలో గోల్డ్ పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా ఇస్త్రీపెట్టె లోపల దాచుకుని తెచ్చిన 594 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణీకుడి వద్ద పోర్టబుల్ స్పీకర్, లైట్లలో దాచుకుని తెచ్చిన 1225 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి "లో'' దుస్తుల్లో దాచిన 1924 గ్రాముల బంగారం పేస్టు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురి నుంచి దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు.. ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.