తెలంగాణ

telangana

బాలీవుడ్​ నటి కంగనాకు అనేక ఎన్నికల 'సవాళ్లు'- ఆ ఒక్క అంశంతో విజయం సాధిస్తారా? - Kangana Ranaut Loksabha Elections

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 12:50 PM IST

Kangana Ranaut Loksabha Elections : హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఇక్కడ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటమే అందుకు కారణం. రాజ వంశీయులకు కంచుకోటైన మండిలో కంగనా విజయావకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీ అసమ్మతివాదుల నుంచి కంగనాకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఈ కథనంలో చూద్దాం

Kangana Ranaut Loksabha Elections
Kangana Ranaut Loksabha Elections

Kangana Ranaut Loksabha Elections : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ బరిలోకి దిగిన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఆమెకు కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. రాజవంశీయులకు కంచుకోటైన మండిలో వారి నుంచే కాకుండా బీజేపీ అసమ్మతివాదుల నుంచి కూడా కంగనాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కంగనాకు బీజేపీ అధిష్ఠానం ఈ హై ప్రొఫైల్‌ నియోజకవర్గాన్ని కేటాయించింది.

మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 8 ఉన్నాయి. మండి లోక్‌సభ నియోజకవర్గానికి రెండు ఉప ఎన్నికలు సహా మొత్తం 19 సార్లు ఎన్నికలు జరగ్గా వాటిలో13 సార్లు రాజవంశీయులే విజయం సాధించారు. కపుర్తలా రాజవంశానికి చెందిన రాజ్ కుమై అమృత్ కౌర్, మండి రాజవంశానికి చెందిన రాజా జోగిందర్ సేన్ బహదూర్ ఒక్కోసారి ఇక్కడ నుంచి గెలిచారు. సుకేత్‌కు చెందిన రాజా లలిత్ సేన్ రెండుసార్లు, మాజీ సీఎం వీరభద్ర సింగ్, ఆమె భార్య ప్రతిభా సింగ్ మూడేసిసార్లు, రాజా మహేశ్వర్ సింగ్ మూడుసార్లు మండి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.

కంగనా రనౌత్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి ప్రతిభా సింగ్‌ ఉన్నారు. బుషార్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రతిభా సింగ్‌ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్‌ ఎంపీ. ఆరుసార్లు హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా పని చేసిన వీరభద్ర సింగ్‌ భార్య ఆమె. హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి విక్రమాధిత్య సింగ్‌కు తల్లి. ఇప్పటికే మూడుసార్లు ఆమె మండి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మండి నుంచి తాను పోటీ చేయడం లేదని చెప్పిన ప్రతిభా సింగ్‌, బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసిన వెంటనే తన వైఖరిని మార్చుకున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాలను అనుసరించి మండి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఇక రాజవంశాలకు చెందని వారు కూడా మండి నుంచి కొన్నిసార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మాజీమంత్రి సుఖ్‌రామ్‌ 3 సార్లు, రామ్‌స్వరూప్‌ 2 సార్లు, గంగాసింగ్‌ ఒకసారి ఇక్కడ నుంచి నెగ్గారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండి నుంచి బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్‌ గెలుపొందారు. ఆయన మరణించిన తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికలో స్వల్ప మెజార్టీతో ప్రతిభా సింగ్‌ విజయం సాధించారు.

సొంత పార్టీలోనే కంగనా అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కులు రాజవంశస్థుడు, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజా మహేశ్వర్ సింగ్, కంగనరనౌత్‌ అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండి నుంచి గతంలో 3 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన, కంగనాకు టికెట్‌ కేటాయించడాన్ని పున‌సమీక్షించాలని బీజేపీ అగ్రనాయకత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. పార్టీకి ఆమె ఎలాంటి సేవ చేయలేదని వివరించారు. తనకే టికెట్‌ ఇస్తామని గతంలో పార్టీ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మండి ప్రజలూ కంగనా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతున్నారని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు మహేశ్వర్‌సింగ్‌ తెలిపారు.

2022లో జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కీలక నేతలకు బీజేపీ టికెట్‌ నిరాకరించింది. అందులో రాజా మహేశ్వర్‌సింగ్‌ కుమారుడు హితేశ్వర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఆయనతో పాటు బీజేపీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌సింగ్‌, మాజీ ఎమ్మెల్యే కిశోర్‌ లాల్‌కు కూడా ఆ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ నిరాకరించింది. వారంతా అప్పుడు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. కంగనాకుటికెట్‌ కేటాయించిన తర్వాత వారంతా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మరికొందరు కాషాయ దళ అసమ్మతివాదులతో వారు భేటీ ఐనట్లు తెలిసింది.

కంగనాకు మండిలో ఊరట లభించిన అంశం ఒకటి ఉంది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్‌ చేతిలో కేవలం ఏడు వేల 490 ఓట్ల తేడాతో ఓడిపోయిన బీజేపీ నేత ఖుషాల్‌ ఠాకూర్‌ కంగనాకు మద్దతు పలుకుతున్నారు. కార్గిల్‌ యుద్ధవీరుడైన ఖుషాల్‌కు మాజీ రక్షణ, సైనిక సిబ్బంది బలం ఉంది. మరోవైపు కంగనా కూడా ఈసారి ఎన్నికల్లో గెలవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాను మండి ప్రజల కుమార్తెను, సోదరిని అంటూ తొలి ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

హిమాచల్‌కు చెందిన వ్యక్తిగా తాను ఎన్నోసార్లు అణచివేతను ఎదుర్కొన్నానని చెబుతూ సెంటిమెంట్‌ రాజేసేందుకు యత్నిస్తున్నారు. తన స్వగ్రామంలో దేవీ ఆలయాన్ని నిర్మించానని, మనాలీలో ఇల్లు కట్టుకున్నట్లు కంగనా తెలిపారు. మరోవైపు కంగనాపై ఇటీవల కాంగ్రెస్‌ నేతలు అభ్యంతర వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. కంగనా ఫోబియాతో కాంగ్రెస్‌ నేతలు బాధపడుతున్నారని పేర్కొంది. కంగనాపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించిన ప్రతిభా సింగ్‌తనయుడు హిమాచల్‌ మంత్రి విక్రమాధిత్య సింగ్‌ 2023లో హిమాచల్‌ వరదల సమయంలో ఆమె ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

లోక్‌సభ బరిలో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​- 111మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల - BJP 5th Lok Sabha Candidates List

ఓవైపు రాజీ కోసం సంప్రదింపులు- మరోవైపు గొర్రెలంటూ ప్రకటనలు: హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details