పొగమంచు ఎఫెక్ట్, విశాఖలో వరుసగా ఢీకొన్న ఐదు వాహనాలు
Published : Dec 27, 2023, 12:31 PM IST
Road Accident due to Fog in Visakhapatnam : విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్, మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొనటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
అయితే వారం రోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పొగమంచు కురుస్తోంది. రోడ్లపై ఎదురుగా వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్మేసి ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.