Man Carrying Wife Body In Rickshaw : భార్య మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్లిన భర్త.. 5కి.మీ తోసుకుంటూనే..
Published : Oct 7, 2023, 10:31 PM IST
|Updated : Oct 8, 2023, 7:09 AM IST
Man Carrying Wife Body In Rickshaw : అంబులెన్స్ సదుపాయం లేక భార్య మృతదేహాన్ని రిక్షాలో 5 కి.మీ తోసుకుంటూ వెళ్లాడు ఆమె భర్త. అందుకు ఆమె కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగింది.
ఇదీ జరిగింది
దహిసద గ్రామంలోని చాపుల్యాకు చెందిన గుర్బా సింగ్, మమతా సింగ్ భార్యాభర్తలు. అయితే, మమతా సింగ్కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు ఆమె భర్త. ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న మమతా సింగ్.. శుక్రవారం సాయంత్రం మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలంటూ ఆస్పత్రి వర్గాలను కోరాడు భర్త. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల.. ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించగా వారు రూ. 1,500 డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడం వల్ల.. ఆ మొత్తాన్ని ఇచ్చుకోలేక రిక్షాలో మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు భర్త. ప్రజల కోసం ఒడిశా ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టినా.. అవి ప్రజల వద్దకు చేరడం లేదు. పుట్టుక నుంచి మరణం వరకు అందరికి ఉచిత అంబులెన్స్ అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే గుర్బా సింగ్.. అంబులెన్స్ ఇవ్వాలని కోరినా.. అధికారులు పట్టించుకోలేదు.