'నకిరేకల్ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే'
KCR Praja Ashirvada Sabha Meeting at Nakrekal : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నకిరేకల్లో అభ్యర్థిని గెలిపిస్తే.. వెనుకబడ్డ నకిరేకల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకమైన శ్రద్ధపెట్టి అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తారో.. అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అందుకే కొత్తగా వచ్చే ప్రభుత్వం బాగోలేకపోతే ఐదేళ్లు బాధపడాలని కేసీఆర్ హెచ్చరించారు.
ఓటు వేసేముందు అభ్యర్థి వ్యక్తిత్వంతో పాటు పార్టీల చరిత్ర, నడవడిక చూడాలని ప్రజలను కోరారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో 400 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. మనదేశ ప్రజాస్వామ్యంలో తగినంత పరిణతి రాలేదన్న కేసీఆర్.. ప్రజల్లో పరిణతి వస్తేనే.. దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఉద్ఘాటించారు. సరిగ్గా ఆలోచించి ఓటు వేయకపోతే బతుకులు ఆగమైపోతాయని హెచ్చరించారు.