ఆసుపత్రిలో కేసీఆర్ పుస్తక పఠనం - పరామర్శించిన పలువురు ప్రముఖులు
Published : Dec 13, 2023, 9:05 PM IST
Eminent Leaders Meets to KCR at Yashoda Hospital : తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని ఆసుపత్రిలో కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ తన వద్దకు వచ్చిన ఓ డాక్యుమెంట్ను చదువుతూ కనిపించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు ఆయనను పరామర్శించేందుకు యశోదా ఆసుపత్రికు ప్రముఖులు వరుసకడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సినీ నటుడు నాగార్జున, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కోసం వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చిన తుమ్మల అక్కడి నుంచి నేరుగా యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం పరామర్శించారు. కేసీఆర్, కోమటి రెడ్డి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని త్వరగా కోలుకుంటున్నారని తుమ్మల పేర్కొన్నారు. కేసీఆర్ త్వరలోనే సాధారణ జీవితం ప్రారంభించి ప్రజలకు సేవ చేయాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆకాంక్షించారు. అక్కినేని నాగర్జున సైతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, బాగా మాట్లాడుతున్నారని తెలిపారు.