Actor Prakashraj Comments on Parliament Sessions : 'మౌనంగా ఉంటే దేశానికి తగిలిన గాయాలు.. రాచపుండు అవుతాయి'
Actor Prakashraj Comments on Parliament Sessions : హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ప్రకాశ్రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోరం బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండు అవుతాయని అని ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజం సందిగ్ధతలో ఉందని చెప్పారు.
పార్లమెంట్ సమావేశాలు.. రాజకీయ వేదికగా మారాయని ప్రకాశ్రాజ్ అభిప్రాయపడ్డారు. వంద రోజులుగా మణిపుర్ మండిపోతుందని.. మణిపుర్ గురించి ప్రశ్నిస్తే అనవసర విషయాలు ప్రస్తావించారని అంటున్నారని వాపోయారు. దేశంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని.. కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రజల పన్నులతో ఎన్నికైన ఎంపీలు ఈ పది రోజుల సమావేశాల్లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరని... సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారని ప్రకాశ్రాజ్ వ్యాఖ్యానించారు.