ETV Bharat / state

మునుగోడు రణరంగం.. తెరాస, భాజపా బాహాబాహీ కొట్లాట

author img

By

Published : Nov 1, 2022, 7:06 AM IST

munugode bypoll
మునుగోడు ఉపఎన్నిక

Munugode by election campaign: భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో పలు చోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. తెరాస-భాజపాల మధ్య పలు గ్రామాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. సైదాబాద్‌, ఆరెగూడెంలో పరిస్థితి అదుపుతప్పడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ్నుంచి రాజగోపాల్‌రెడ్డిని తరలించారు.

మునుగోడులో తెరాస, భాజపా మధ్య పరస్పర దాడులు

TRS BJP mutual attacks in munugode: భాజపా ప్రచారంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంతంగిలో ప్రచారం ముగిసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి సైదాబాద్‌ వెళ్లారు. అక్కడ తెరాస నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి భాజపా జెండా కర్రను విసరడంతో తెరాస మహిళా కార్యకర్తకు గాయమైంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

Munugode by election campaign : అనంతరం ప్రచారంలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి రెడ్డిబావి గ్రామం మీదుగా ఆరెగూడం వెళ్లారు. అక్కడ ప్రసంగం ముగించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరు భాజపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పింది. రాళ్లు విసిరిన నిందితుల్ని పట్టుకోవాలని భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాసేపటి తర్వాత ఏసీపీ ఉదయ్‌రెడ్డి హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. మరోపక్క పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.

ఆరెగూడెంలో జరిగిన ఘటనను మంత్రి హరీశ్​రావు హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఎన్నికల ప్రచారం సమయం ముగిసిన తర్వాత ఆరెగూడెంలో ప్రచారం చేసిన భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై అక్కడి ప్రజలు తిరగబడ్డారన్న మంత్రి.. ఆగ్రహానికి లోనైన రాజగోపాల్ రెడ్డి వర్గీయులు ప్రజలపై దాడి చేయడం మొదలుపెట్టారన్నారు. భాజపా నాయకులు చేసిన ఈ దాడిలో తెరాస నాయకులు గాయపడటంతో పాటు, పలువురు విలేకరులు గాయపడ్డారన్నారు. ప్రజలపై గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సైదాబాద్​లో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. అంకిరెడ్డిగూడెంలో తెరాస, భాజపా పరస్పర దాడులలో పలువురుకి గాయాలయ్యాయి. ప్రచారంలో భాగంగా ఉద్రిక్తతలు తలెత్తుతుండటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. చివరి రోజు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.