ETV Bharat / state

తుది అంకానికి ఉపఎన్నిక పోరు.. చివరి అస్త్రం ప్రయోగిస్తున్న ప్రధాన పార్టీలు

author img

By

Published : Oct 31, 2022, 8:58 PM IST

తుది అంకానికి ఉపఎన్నిక పోరు.. చివరి అస్త్రం ప్రయోగిస్తున్న ప్రధాన పార్టీలు
తుది అంకానికి ఉపఎన్నిక పోరు.. చివరి అస్త్రం ప్రయోగిస్తున్న ప్రధాన పార్టీలు

Munugode Bypoll Campaign: మునుగోడు ఉపఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచార ఘట్టానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చివరి రోజు ఓటర్లను తమవైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్రస్థాయి నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మోహరించింది. పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్న నేతలు.. ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు.

Munugode Bypoll Campaign: రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది. నెల రోజులుగా ప్రచారాలు, రోడ్‌షోలు, ర్యాలీలతో హోరెత్తించిన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా ఈ రెండ్రోజుల పాటు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారంలో తొలి నుంచి దూకుడుగా ఉన్న అధికార తెరాస.. గ్రామగ్రామాన ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. నిన్న చండూరులో సీఎం సభ తర్వాత ఉత్సాహంతో ఉన్న గులాబీదళం.. అదే ఊపును పోలింగ్‌ వరకు కొనసాగించాలని భావిస్తోంది. చివరి నిమిషం వరకు క్లస్టర్లలోనే ఉండాలని ఇన్‌ఛార్జీలకు పార్టీ ఆదేశాలు జారీ చేయగా.. ప్రతి ఓటరును టచ్‌ చేసేలా నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓవైపు అభ్యర్థి కూసుకుంట్ల ప్రచారం సాగిస్తుండగా.. మరోవైపు శ్రేణులతో కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాంపల్లి మండలం పసునూరులో మహిళలతో భేటీ అయిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తెరాస సర్కార్‌కు అండగా ఉండాలని కోరారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి సంస్థాన్ నారాయణపురం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్.. తన జన్మదిన వేడుకలనూ గరికగడ్డ తండాలో గిరిజనుల మధ్యే జరుపుకున్నారు. తెరాస అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

పసునూరులో స్వల్ప ఉద్రిక్తత..: తమ్మడపల్లిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. తుమ్మలపల్లి, బంగారిగడ్డ గ్రామాల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి పర్యటిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. మునుగోడు మండలం పులిపలుపులలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ ర్యాలీ నిర్వహించారు. చౌతుపల్లిలో కూసుకుంట్లకు మద్దతుగా ఏఐఎస్‌ఎఫ్‌ శ్రేణులు ప్రచారం నిర్వహించాయి. పసునూరులో ప్రచారం వేళ.. తెరాస, భాజపా కార్యకర్తలు ఎదురెదురుగా రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జోక్యం చేసుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.

భాజపా బైక్‌ ర్యాలీలు..: అధికార తెరాసకు పోటీగా తొలి నుంచి ప్రచారం సాగిస్తున్న భాజపా.. మిగిలి ఉన్న ఈ రెండ్రోజులను కీలకంగా భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండ్రోజుల పాటు నియోజకవర్గవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తోంది. మునుగోడు, సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ వరకు భాజపా నేతలు బైక్‌ ర్యాలీలు తలపెట్టారు. చండూర్ మున్సిపాలిటీ పరిధిలో భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో భాజపా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌తో పాటు పెద్దఎత్తున శ్రేణులు పాల్గొన్నారు.

సిట్టింగ్‌ స్థానంలో సత్తాచాటాలని..: మరోవైపు.. తెరాస, భాజపాలకు పోటీగా సాగుతున్న కాంగ్రెస్ సిట్టింగ్‌ స్థానంలో సత్తాచాటాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రతో పాటు ఉప ఎన్నికను సమన్వయం చేసుకుంటూ.. నేతలు ముందుకు సాగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇప్పటికే పలుమార్లు ప్రచారంలో పాల్గొనగా.. పార్టీ సీనియర్లు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సంపత్‌ సహా మరికొందరు నియోజకవర్గంలోనే మకాం వేశారు. నాంపల్లిలో ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు మునుగోడులో కాంగ్రెస్ నిర్వహించనున్న మహిళా గర్జన కార్యక్రమానికి పెద్దఎత్తున మహిళలను తరలించేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..: ఉప ఎన్నిక వేళ అధికార యంత్రాంగం పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నం కాగా.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట్ వద్ద మంత్రి ప్రశాంత్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. తిరుగండ్లపల్లి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు జరిపిన పోలీసులు.. భాజపా ప్రచార రథంలో రూ.5 లక్షలు స్వాధీనం చేసుకుని.. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసేలా మోహరించిన భద్రతా బలగాలు.. ఇందులో భాగంగా సంస్థాన్ నారాణయపూర్‌లో భారీ కవాతు నిర్వహించాయి.

ఇవీ చూడండి..

'రేపు సాయంత్రం నుంచి మునుగోడులో విస్తృత తనిఖీలు.. వారంతా వెళ్లిపోవాలి'

అక్కడి రైతుల ఖాతాల్లోకి నగదు.. ఎవరు వేశారో తెలీదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.