ETV Bharat / state

Shirisha murder case update : శిరీష హత్య కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు

author img

By

Published : Jun 14, 2023, 4:46 PM IST

Updated : Jun 14, 2023, 7:27 PM IST

Shirisha murder case
Shirisha murder case

Paramedical student murder case accused : సంచలనం సృష్టించిన పారా మెడికల్‌ విద్యార్ధిని శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత అక్క భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కనిపించకుండా పోయిన మరదలి కోసం అందిరితో కలిసి వెతికాడు. చివరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో హత్యోదంతం బయటపడింది. హత్య జరిగినప్పటి నుంచి బావ అనిల్​పైనే పోలీసులకు అనుమానం వచ్చింది. అదే కోణంలో లోతుగా విచారణ జరపడంతో అన్ని విషయాలు బయటపడ్డాయి.

Paramedical student Shirisha murder case : వికారాబాద్‌ జిల్లా కాడ్లాపూర్‌ గ్రామంలో పారామెడికల్‌ విద్యార్ధిని శిరీషను ఆమె అక్క భర్త అనిల్‌ హతమార్చినట్టు పోలీసులు తేల్చారు. శిరీషను వివాహం చేసుకోవాలని, శారీరకంగా అనుభవించాలనే దురాలోచ హత్యకు దారి తీసినట్లు పోలీసుల తెలిపారు. ఇందుకు ఆమె సహకరించకపోవడంతోనే బీరు సీసాతో దాడి చేసి అనంతరం నీటి కుంటలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాడ్లాపూర్‌ గ్రామానికి చెందిన జంగయ్య, యాదమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. జంగయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్య మూడో సంతానం శిరీష ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి పారామెడికల్‌ కోర్సులో చేరింది. కొద్ది రోజుల క్రితం తల్లికి గుండెపోటు రావడంతో మధ్యలోనే చదువు ఆపింది. అయితే ఈనెల 10వ తేదీన ఇంట్లో తండ్రి, సోదరుడితో వాగ్వాదం జరిగింది. ఫోన్‌లో తరచు ఎవరితో మాట్లాతున్నావు, ఎవరితో చాటింగ్‌ చేస్తున్నావంటూ శిరీషతో వారు గొడవ పడ్డారు.

ఈ విషయం ఆమె అక్క లలిత భర్త అనిల్​కు చెప్పడంతో అతను శిరీషను కొట్టాడు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు నిలువరించారు. అదే రోజు రాత్రి ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిపోయింది. శిరీష ఇంటి నుంచి వెళ్లిపోయిందని బావ అనిల్‌కు ఆమె సోదరుడు ఫోన్‌ చేసి చెప్పాడు. అనిల్‌ తమ గ్రామం నుంచి భార్య లలితను తీసుకొచ్చి.. శిరీషను వెదికేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. శిరీషను మార్గ మధ్యలో గమనించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

Paramedical student murder case latest news : తన కోరిక తీర్చకపోవడం, తనను పెళ్లి చేసుకోవడానికి సహకరించడం లేదనే కోపంతో ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో చేతులతో, కర్రతో తీవ్రంగా కొట్టాడు. సమీపంలో ఉన్న నీటి కుంట వద్దకు తీసుకువెళ్లి బీరు సీసాతో ముఖంపై కొట్టాడు. దీంతో గాజు ముక్కలు కళ్లకు గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలపాలైంది. అయినా వదలకుండా అనిల్‌ ఆమెను కర్కశంగా సమీపంలో ఉన్న నీటి కుంటలో ముంచి ఊపిరి ఆడకుండా చేయడంతో శిరీష మృతి చెందింది. మృతి చెందిందని నిర్ధారించుకున్నాక నీటి కుంటలో మృతదేహాన్ని పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఆ తరువాత అందరితో కలిసి శిరీష కనిపించడం లేదంటూ వెతికాడు. అనుమానం వచ్చిన పోలీసులు అనిల్​ను పూర్తి స్థాయిలో విచారించడంతో శిరీషను తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోస్టుమార్టం నివేదికలో శిరీషపై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కేసులో రాజు ప్రమేయం ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసి ఛేదించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ వేగవంతం పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. నిందితుడి ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"విద్యార్థిని శిరీష హత్య కేసులో ఆమె బావ అనిల్‌ హత్య చేశాడు. శిరీష తనకు లొంగకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శిరీష మరో యువకుడితో చాటింగ్‌ చేయడం గమనించాడు. శిరీష విషయంలో ఆమె తండ్రి, సోదరుడితో అనిల్‌ వాగ్వాదానికి దిగాడు. అనిల్‌ కొట్టడంతో ఇంటి నుంచి శిరీష వెళ్లిపోయింది. ఆమెను అనుసరించి గ్రామ శివారులో మరల గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉండి బీరు సీసాతో శిరీషపై దాడి చేశాడు. తర్వాత నీటికుంటలో ముంచి హతమార్చాడు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ జరిపి నిందితుడికి వేగంగా శిక్ష పడేలా చేస్తాం".- కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీ

శిరీష హత్య కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు

ఇవీ చదవండి:

Last Updated :Jun 14, 2023, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.