ETV Bharat / state

నీరు.. నీరు... నీరు... రైతు కంట నీరు..!

author img

By

Published : Mar 30, 2021, 3:47 PM IST

రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తే పంట చేతికొచ్చే సమయానికి.. బావుల్లో నీరు అడుగంటిపోయి రైతుల కళ్లల్లో నీళ్లు తేలియాడుతున్నాయి. పంట పండిన తర్వాత లాభాలు వస్తాయో రావో కానీ పంట సాగుకు తెచ్చిన అప్పు తీర్చేదెలా అంటూ.. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలంలోని గిరిజన రైతులు వాపోతున్నారు.

siddipet farmers problems
సిద్ధిపేట రైతుల ఆవేదన

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నేలపాలు అవుతుంటే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు తీవ్ర మనోవేదనకు దుఃఖానికి గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతం, నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని పలు తండాలలో గిరిజన రైతులు. ఈ యాసంగిలో అధిక శాతం వరి పంటను వేశారు. అయితే పంటలు వేసే సమయంలో చెరువుల్లో కుంటల్లో బావుల్లో సమృద్ధిగా నీరు ఉంది. కానీ పంట చేతికి వచ్చే చివరి ఈ నెల రోజుల్లో చెరువుల్లో కుంటల్లో బావుల్లో నీరు అడుగంటి పోవడంతో రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి.

అక్కన్నపేట మండలం చాపగాని తండాలో సుమారు 80 ఎకరాల వరకు గిరిజన రైతులు ఈ యాసంగి లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం వరి పంటకు సాగునీరు అందించడానికి ఆధారమైన బావుల్లో నీరు అడుగంటి పోయి, పంటకు నీరు అందక కళ్ల ముందే వరిపైరు ఎండిపోతుంటే గిరిజన రైతులు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. అప్పులు తీసుకు వచ్చి ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంటలు ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం..!

రాష్ట్ర గిరిజన సంఘం నాయకుడు భాస్కర్ నాయక్ తండాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర దుఃఖంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు, హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాలకు కాళేశ్వరం జలాలు వస్తుంటే, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ ప్రాంతానికి తీసుకు రావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించి వ్యవసాయ అధికారులతో పంట నష్టపోయిన రైతుల పొలాలను సర్వే చేయించి తగిన నష్టపరిహారం అందేలా చూడాలని.. లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పోకో కొత్త స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్లు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.