సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఐదు వేల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కలెక్టరు హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా ఆస్పత్రిలో అదనంగా రెడ్క్రాస్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు మండలాల ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు.
అకోలా-నాందేడ్ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న గుడితండా గ్రామస్థులకు నష్ట పరిహారం పెంచాలన్నారు. సదాశివపేటలో ప్రభుత్వ ఆస్పత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం అందించాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.