ETV Bharat / state

Cyber Frauds in Sangareddy District : 'పార్ట్​టైం జాబ్ కావాలా'.. అంటూ మెసేజ్ వచ్చిందా.. ఐతే జాగ్రత్తగా ఉండాల్సిందే

author img

By

Published : Aug 4, 2023, 2:21 PM IST

Cybercrime
Cybercrime

Cyber Frauds in Ameenpur : సామాజిక మాధ్యమాల వినియోగం పెరగటంతో అదే స్థాయిలో సైబర్‌ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్ వంటి వాటిని ఉపయోగించుకొని సైబర్​ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ​ ఉద్యోగినికి వల వేసిన కేటుగాళ్లు.. రూ.46 లక్షలు కాజేశారు. దీంతో బాధిత మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

Cybercrimes in Sangareddy District : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు... బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పడం లాంటివి ఇప్పుడు సాధారణమయ్యాయి. మరోవైపు సంక్షిప్త సందేశాలు పంపి నగదు కాజేస్తున్నారు. తాజాగా ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగుల నుంచి అందినకాడికి డబ్బు దోచుకున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Cyber Frauds in Ameenpur : తాజాగా అమీన్‌పూర్‌కి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగినికి.. మే 15న పార్ట్ టైం జాబ్ అంటూ.. వాట్సాప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ సంక్షిప్త సందేశానికి స్పందించిన ఆమె.. అందులో సూచించిన సైట్‌లో తన వివరాలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే సదరు ఉద్యోగినికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇందులో భాగంగానే ముందుగా బాధితురాలు రూ.2,000 చెల్లించింది. అనంతరం సైట్ నిర్వాహకులు ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే బాధితురాలు పెట్టిన నగదుకు.. అందుకు వచ్చిన కమిషన్‌ను సైబర్ నేరగాళ్లు ఆమెకు ఇచ్చిన వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఇలా బాధితురాలి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.46 లక్షలు పెట్టించారు. ఈ నేపథ్యంలోనే సదరు ఉద్యోగిని తన డబ్బులు, కమిషన్ ఇవ్వాలని వారిని అడిగింది. దీనికి వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది.

Cyber Frauds in Sangareddy District : మరో ఘటనలో అమీన్‌పూర్‌కి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి బ్యాంకు నుంచి అంటూ సైబర్ నేరగాళ్లు ఓ మేసేజ్‌ను పంపిచారు. అందులో ఓ ఫైల్ ఫార్మాట్‌ని ఓపెన్ చేసిన బాధితుడు.. అందులో తన వివరాలను నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన వివరాలు వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వెంటనే సైబర్ నేరగాళ్లు అతని ఖాతాలో ఉన్న రూ.1.79 లక్షలు కాజేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Cyber Frauds in Telanagana : మరోవైపు సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల పెట్టుబడులు పేరుతో మోసాలపై అధిక సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. టెలిగ్రామ్‌, వాట్సప్​తో పాటు ఎస్‌ఎంఎస్​ల ద్వారా లింకులు పంపి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని.. అలాంటి వాటిపట్ల జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే తమకి దృష్టికి వస్తున్నాయని అంటున్నారు. ఎక్కడైనా క్లిక్‌లు చేస్తే డబ్బులు వస్తున్నాయంటే ఆలోచించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.