ETV Bharat / state

'నా బిడ్డ విషయంలో నవీన్​రెడ్డి మొదటి నుంచీ సైకోగా వ్యవహరించాడు'

author img

By

Published : Dec 10, 2022, 12:41 PM IST

Updated : Dec 10, 2022, 3:32 PM IST

Manneguda Kidnap Case: హైదరాబాద్​ శివారు మన్నెగూడలో జరిగిన యువతి కిడ్నాప్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతిని సొంతం చేసుకునేందుకు నవీన్​రెడ్డి.. మొదటి నుంచీ కుట్ర పన్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

'నా బిడ్డ విషయంలో నవీన్​రెడ్డి మొదటి నుంచీ సైకోగా వ్యవహరించాడు'
'నా బిడ్డ విషయంలో నవీన్​రెడ్డి మొదటి నుంచీ సైకోగా వ్యవహరించాడు'

Manneguda Kidnap Case : రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శుక్రవారం పక్కా ప్రణాళిక ప్రకారం యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి.. యువతిపై దుష్ప్రచారం చేసేందుకు మొదటి నుంచీ కుట్ర పన్నాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి పేరుతో నకిలీ ఇన్​స్ట్రాగ్రామ్​ ఖాతా క్రియేట్ చేసిన నవీన్ రెడ్డి.. ఆ ఖాతా ద్వారా వాళ్లిద్దరూ దిగిన ఫొటోలను పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

నవీన్ రెడ్డి క్రియేట్ చేసిన ఫేక్ ఇన్​స్టాగ్రామ్​పై ఆదిభట్ల పీఎస్​లో అక్టోబర్ 10న కేసు నమోదు చేసి ఆదిభట్ల సీఐ నరేందర్ దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఫేక్ ఇన్​స్ట్రాగ్రామ్​కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. నిందితుడు నవీన్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన రఘుమారెడ్డి, మరో వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ ఇన్​స్టాగ్రామ్​ను నవీన్ రెడ్డి క్రియేట్ చేసినట్లు పూర్తి ఆధారాలు సేకరించారు.

దంత వైద్యురాలికి.. తనకు వివాహమైందని ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ప్రచారం చేసుకున్న నవీన్​రెడ్డి.. ఎల్బీనగర్ కోర్టులో తన వివాహ విషయమై పిటిషన్ వేశాడు. ఎల్బీనగర్ కోర్టు నుంచి యువతి తండ్రికి నోటీసులు పంపించగా.. నవీన్ దుష్ప్రచారంపై ఎల్బీనగర్ పీఎస్​లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ పీఎస్​కు వెళ్తే అది ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారన్నారు. ఆదిభట్ల పోలీస్​స్టేషన్​కు వెళ్తే సరిగ్గా స్పందించలేదని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్..: దంత వైద్యురాలి విషయంలో మొదటి నుంచీ నవీన్​రెడ్డి సైకోగా వ్యవహరించాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. బ్యాడ్మింటన్​ కోర్టు వద్ద యువతిని నవీన్​రెడ్డి పరిచయం చేసుకున్నాడని.. ఆ తర్వాత ఆమెని సొంతం చేసుకునేందుకు ఎన్నో డ్రామాలు ఆడాడన్నారు. పెళ్లయినట్లు నమ్మించేందుకు కుట్ర చేశాడని తెలిపారు. ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా దంత వైద్యురాలి పేరు రాయించిన నవీన్ రెడ్డి.. ఆ పత్రాలను ఆధారంగా చూయించి కోర్టులో పిటిషన్ వేశాడన్నారు. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడని.. ఆ సమయంలో దంత వైద్యురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులు ఉన్నాయని స్పష్టం చేశారు.

నా తలపై రాడ్డుతో కొట్టాడు..: నవీన్‌రెడ్డి, రూబెన్‌, మరో 50 మంది అనుచరులు శుక్రవారం తన ఇంటిపై దాడి చేశారని యువతి తండ్రి ఆరోపించారు. కారులో ఐరన్‌ రాడ్లు, రాళ్లు తీసుకొని ఇంటికి వచ్చారన్న ఆయన.. తన కుమార్తె, కుటుంబసభ్యులను చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారని తెలిపారు. నవీన్‌రెడ్డి.. తన తలపై రాడ్డుతో దాడి చేశాడని ఆరోపించారు. తన స్నేహితులు మధ్యలోకి వస్తే వారిపైనా దాడి చేశారన్నారు. దాడి తర్వాత తన కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్లారని.. ఇంట్లో ఉన్న సామగ్రి, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంచిరెడ్డి కిషన్​రెడ్డి పరామర్శ..: దంత వైద్యురాలి కుటుంబసభ్యులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా 'కిడ్నాప్ ఘటన దురదృష్టకరం. ఇంటి మీదికి వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేయడం హేయమైన చర్య. నవీన్ రెడ్డి చేసిన సైకో ఆలోచన తప్పు. నవీన్ రెడ్డితో పాటు ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిన్న జరిగిన దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. కిడ్నాప్ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. సత్వర న్యాయం జరిగేలా చూస్తాం.' అని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

సినిమా తరహాలో యువతి కిడ్నాప్​.. 100 మందితో వచ్చి..

నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్‌.. 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Last Updated : Dec 10, 2022, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.