Farmers Problems in Telangana : లారీలు లేక అవస్థలు.. అన్నదాతలకు తప్పని తిప్పలు
Published: May 25, 2023, 3:38 PM


Farmers Problems in Telangana : లారీలు లేక అవస్థలు.. అన్నదాతలకు తప్పని తిప్పలు
Published: May 25, 2023, 3:38 PM
Farmers Problems in Telangana : పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అధికారుల తీరును నిరసిస్తూ అన్నదాతలు నిరసనకు దిగారు. నెల రోజులుగా వేచి చూస్తున్నా.. లారీలు లేవనే సాకుతో కొనుగోళ్లు జరపడం లేదని మండిపడ్డారు. మరోవైపు.. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు, మిల్లుల్లో తూకంలో కోతల ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Farmers Problems in Telangana : అకాల వర్షాలతో ఇప్పటికే ఎంతో నష్టపోయిన అన్నదాతలు.. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల దోపిడీతో మరింత దగాకు గురవుతున్నారు. మిగిలిన కాసింత ధాన్యాన్నీ అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కొనుగోళ్లు సక్రమంగా జరగక.. పలుచోట్ల లారీలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తరుగు పేరిట మరింత నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు, మిల్లుల్లో తూకంలో కోతల ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు వ్యవసాయ మార్కెట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
40 కిలోల బస్తా నుంచి మార్కెట్ యార్డు అధికారులు తరుగు పేరుతో రెండు నుంచి మూడు కిలోల ధాన్యం సేకరిస్తున్నట్లు ఈ సందర్భంగా రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. మిల్లులకు వెళ్లిన తర్వాత అక్కడా మిల్లు యజమానులు తూకంలో మరో రెండు కిలోలు కోత విధిస్తున్నట్లు వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కొరవడటంతోనే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రమణా రావు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మిల్లుల యజమానులతో కుమ్మక్కు కావడం వల్లే కోతల పేరుతో రైతుల దోపిడీ జరుగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
''స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కొరవడటంతోనే అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మిల్లుల యజమానులతో కుమ్మక్కు కావడం వల్లే కోతల పేరుతో రైతుల దోపిడీ జరుగుతోంది.'' - విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే
మార్కెట్లో బైఠాయించి అన్నదాతల నిరసన..: మరోవైపు.. లారీలు రావడం లేదనే కారణంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో మంథని మండలం చిన్న ఓదాల గ్రామంలో అన్నదాతలు మార్కెట్లోనే బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు.. నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయినా కొనుగోళ్లు జరగకపోవడంతో నేడు మార్కెట్లో బైఠాయించి నిరసన తెలిపారు. లారీలు రావడం లేదని, 3 కిలోల తరుగుకు ఒప్పుకున్నా.. కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ధాన్యాన్ని అధికారులు కొనడం లేదని, మార్కెట్లో 136 లారీల ధాన్యం ఇప్పటికే నిల్వ ఉందని, అందులో 11 లారీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసినట్లు రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వడం లేదన్నారు. చెరువు పక్కనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండటం వల్ల వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా లారీలను ఏర్పాటు చేసి.. ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని.. లేనిపక్షంలో భారీ ఎత్తున నిరసనలు చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనకు కిసాన్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
ఇవీ చూడండి..
Seed Festival in Hyderabad : 'పండిన పంటే విత్తనం.. అలా చేస్తేనే నాసిరకం విత్తనాన్ని అడ్డుకోగలం'
Jeevan Reddy Fires on BRS Govt : 'రైస్మిల్లర్ల చెప్పుచేతుల్లో ధాన్యం సేకరణ'
