వసంత పంచమి వేడుకలు... బాసర సరస్వతి ఆలయంలో వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి జన్మ తిథిని పురస్కరించుకుని... అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సరస్వతి అమ్మవారికి విశేష అలంకరణ, హారతి, నివేదన సేవ చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
ఈరోజు రాష్ట్ర దేవాదాయశాఖ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి.. తీర్ధప్రసాదాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాసర వద్ద గోదావరిలో పుణ్య స్నానాలు భక్తులు పెద్ద సంఖ్యలో ఆచరిస్తున్నారు. సాయంత్రం అమ్మవారికి చతుషష్టిపూజలు, హారతి నివేదన ఉంటుంది. అమ్మవారికి పల్లకి సేవ నిర్వహణతో ఉత్సవం ముగియనుంది.
- ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్